హైదరాబాద్ నవంబర్ 28
హైదరాబాద్ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తున్నామని, మరోమారు ఆశీర్వదించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. సంక్షేమ పథకాలతో పేదలను అన్నిరకాలుగా ఆదుకుంటున్నామని చెప్పారు. బేంగంపేటలోని మ్యారిగోల్డ్ హోటల్లో జరిగిన ‘వైబ్రంట్ హైదరాబాద్’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరేండ్ల క్రితం హైదరాబాద్లో వ్యాపారులకు అనేక అనుమానాలు ఉండేవని చెప్పారు. ఉద్యమపార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎలా అభివృద్ధి చేస్తారని అనుమానాలు వ్యక్తంచేశారని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కరెంట్ కోతలకు వ్యతిరేకంగా పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారు. అయితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కరెంట్ సమస్యను తీర్చామన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ ముందుందని చెప్పారు. అత్యధిక విద్యుత్ వినియోగం అభివృద్ధికి సూచిక అని వెల్లడించారు. పేదలకోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, మనందరి కోసం పనిచేసే పారిశుధ్య కార్మికుల వేతనాలు రెట్టింపు చేశామని తెలిపారు. సామాన్యుల వైద్యం కోసం బస్తీ దవాఖానలు ప్రారంభించామని చెప్పారు. అన్నపూర్ణ క్యాంటీన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలు అమలుచేస్తున్నామన్నారు. మంచినీటి సమస్యను 95 శాతం పరిష్కరించామని చెప్పారు. ప్రసూతి, శిశు మరణాల రేటును తగ్గించడంలో తెలంగాణ సఫలమయ్యిందన్నారు. ఫ్లైఓవర్లు, లింక్రోడ్లు, అండర్పాస్లు, కొత్త రోడ్లతో ట్రాఫిక్ సమస్యలకు చెక్పెడుతున్నామని తెలిపారు.