హైదరాబాద్, నవంబర్ 30,
గ్రేటర్లో ముగిసిన ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి నిముషం వరకూ హోరాహోరీ ప్రచారం సాగింది. ఎన్నికల ప్రచారం సార్వత్రిక ఎన్నికలను తలపించింది. చివరి నిముషం వరకూ ఓటర్ల కరుణ కోసం నేతలు పాట్లు పడ్డారు. రోడ్షోలు, పబ్లిక్ మీటింగ్లతో హోరెత్తించారు. జీహెచ్ఎంసీ బరిలో 1,122 మంది అభ్యర్థులు నిలిచారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి తెలిపారు.గ్రేటర్ లో మొత్తం వార్డులు 150 ఉన్నాయని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 74,04,286 ఓటర్లు ఉన్నారని తెలిపారు. టీఆర్ఎస్ 150, బీజేపీ 149, కాంగ్రెస్ 146, టీడీపీ 106 డివిజన్లలో పోటీ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఎంఐఎం 51, సీసీఐ 17, సీపీఎం 12, స్వతంత్ర అభ్యర్థులు 415 మంది పోటీ చేస్తున్నారని వివరించారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికల పోలింగ్ జరుగనుందని చెప్పారు. 4వ తేదీన కౌంటింగ్ జరుగనుందని పేర్కొన్నారు. కరోనా కారణంగా బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ నిర్వహించనున్నట్లు పార్థసారథి తెలిపారు. గ్రేటర్ ఎన్నికల కోసం 28,683 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పోలింగ్ విధుల్లో 45 వేల సిబ్బంది పాల్గొంటారని చెప్పారు. గ్రేటర్లో అతి చిన్న డివిజన్ ఆర్సీ పురం అన్నారు. పోలింగ్ కోసం 9101 కేంద్రాల ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 532, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు 308, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 1004 ఉన్నాయని పార్థసారథి వివరించారు.గ్రేటర్ఎన్నికల కోసం పోలింగ్ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయని పార్థసారధి పేర్కొన్నారు. కరోనా వైరస్నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని…ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద భౌతిక దూరం పాటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.అన్ని పార్టీలు గ్రేటర్ పీఠాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం సార్వత్రిక ఎన్నికలను తలపించింది. కూల్గా మొదలైన ప్రచారం చివరకు చేరేసరికి సెగలు పుట్టించింది. టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడగా… కాంగ్రెస్, టీడీపీలు సైలెంట్గా ప్రచారాన్ని సాగించాయి.గతంలో ఎన్నడూ లేనంత వాడివేడిగా సాగింది. గ్రేటర్ ఓటరును ప్రసన్నం చేసుకునేందుకు అన్నీ పార్టీలు పూర్తిగా ఎఫర్ట్స్ పెట్టాయి. ఓటరును ఆకట్టుకునేందుకు తమవైపు తిప్పుకునేందుకు పార్టీలు చేయని ప్రయత్నం లేదు. మేయర్ ఫీఠమే లక్ష్యంగా సాగిన పార్టీల ప్రచారం చివరి దశకు చేరుకునే సరికి యుద్ధాన్ని తలపించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే పార్టీలు ప్రచార పర్వంలోకి దిగిపోయాయి. మొదట టీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య విమర్శలతో ప్రచారం మొదలైంది. తర్వాత బీజేపీ వల్లే వరదసాయం ఆగిందన్న ఆరోపణలతో సీన్ మారిపోయింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ సమరం సాగింది. టీఆర్ఎస్ తరపున కేటీఆర్ ప్రచార భారాన్ని మోసారు. ఎల్బీ స్టేడియంలో సభతో కేసీఆర్ హీట్ పుట్టించారు.ఇక బీజేపీ తరపున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటు జాతీయనేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ హడావుడి మాత్రం అంతలా కనిపించలేదు. వలసలతో కాంగ్రెస్ అల్లాడింది. స్టార్ క్యాంపెయినర్లు కూడా ప్రచారంలో కనిపించలేదు.మొత్తానికి కూల్గా మొదలైన గ్రేటర్ ప్రచారం చివరికి వచ్చేసరికి తుఫాన్గా మారింది. అభివృద్ది ఎజెండా పక్కకు పోయి.. వివాదస్పద కాంమెంట్స్తో.. గ్రేటర్ ప్రచారం దడదడలాడింది. ఇక ఎల్లుండి జరిగే పోలింగ్లో ఓటరు ఎవరిని హైదరాబాద్ బాద్షాగా నిలుపుతారో చూడాల్సి ఉంది