హైదరాబాద్, డిసెంబర్ 2,
గ్రేటర్ హైదరాబాద్ లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే కేటీఆర్, కవిత ఓటు హక్కు వినియోగించుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఓటు వేసినందుకు విమర్శిస్తారా అంటే.. గత ఎన్నికల్లో ఒక చోట.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరో చోట ఓటు హక్కును వినియోగించుకోవడమే ఈ విమర్శలకు కారణమైంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మంత్రి కేటీఆర్ నందీనగర్ లో, కవిత గాంధీనగర్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి కేటీఆర్ క్యూలైన్ లో నిల్చొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందినగర్ లోని 8 వ నెంబర్ పోలింగ్ బూత్ లో మంత్రి ఓటు వేశారు. ఓటు వేసే వారికి మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దయచేసి అందరూ ఓటేయాలని కోరారు. ఆలోచించి ఓటు వేయాలని, ఓటువేసి హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అయితే ఆయనకు సొంత నియోజకవర్గం సిరిసిల్లలో కూడా ఓటు హక్కు ఉందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతూ ఉన్నారు. అధికారం మనదైతే…చట్టం కూడా చుట్టమేనా ? మంత్రి గారికీ,ఆయన సతీమణికి అటు సిరిసిల్లలో.. ఇటు గ్రేటర్ లో రెండు చోట్ల ఓటు హక్కు అంటూ విమర్శలు గుప్పించారు. దీనిపై టీఆర్ఎస్ వర్గాలు ఏమని సమాధానం చెప్తాయో చూడాలి.