నల్గొండ, డిసెంబర్ 3,
తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో…అక్కడ ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అన్ని పార్టీల దృష్టి ఇప్పుడు నాగార్జుసాగర్పై పడింది. అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తరపున ఎవరు పోటీచేస్తారనేదానిపై అప్పుడే రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. నోముల నర్సింహయ్య, జానారెడ్డి వారసులు…ఏ పార్టీల నుంచి బరిలోకి దిగుతారనేదానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో జరగబోయే మూడో ఉప ఎన్నిక ఇది. ఎంపీగా గెలవడంతో కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ గత ఏడాది ఉప ఎన్నిక జరిగింది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ…ఆ స్థానంలో టీఆర్ఎస్ గెలుపొందింది. ఇటీవల దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంలో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. ఇక ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నాగార్జున సాగర్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నాయి.గత ఎన్నికల్లో నోముల నర్సింహయ్య కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై విజయం సాధించారు. నోముల కుమారుడు, న్యాయవాది భగత్ ఇప్పటికే టీఆర్ఎస్లో చురుగ్గా పనిచేస్తున్నారు.నాగార్జున సాగర్ టికెట్ను టీఆర్ఎస్ భగత్కు కేటాయించే అవకాశం ఉంది. ఇకసుదీర్ఘకాలం నాగార్జున సాగర్కు ప్రాతినిధ్యం వహించారు. జానారెడ్డి. గత ఎన్నికల్లో ఓటమితో కొంతకాలంగా ఆయన రాజకీయాల్లో యాక్టివ్గా ఉండడం లేదు.ఇప్పుడు ఉప ఎన్నిక వస్తుండడంతో నాగార్జునసాగర్లో మళ్లీ గెలవాలని జానారెడ్డి కుటుంబం భావిస్తోంది. గత ఎన్నికల్లోనే నాగార్జున సాగర్ నుంచి పోటీకి ఆసక్తి చూపారు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి. ఈ ఉప ఎన్నికలోనూ ఆయన పోటీచేసే అవకాశం కనిపిస్తోంది. రఘువీర్ రెడ్డి తమతో టచ్లో ఉన్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి.నాగార్జున సాగర్ రాజకీయం మొత్తం జానారెడ్డి కుటుంబం చుట్టూనే తిరుగుతోంది. దుబ్బాకలో గెలిచిన ఉత్సాహంతో ఉన్న బీజేపీ నాగార్జునసాగర్పై ప్రత్యేక దృష్టి పెడుతోంది. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ…నియోజకవర్గంలో తిరుగులేని పట్టున్న జానారెడ్డి కుటుంబాన్ని పార్టీలోకి తీసుకుంటే…అక్కడ గెలుపు ఖాయమన్న ఆలోచనలో ఉంది బీజేపీ అధిష్టానం. జానారెడ్డి కుమారుడు రఘువీర్ను పార్టీలో చేర్చుకుని, టికెట్ కేటాయించి..గెలుపొందాలని భావిస్తోంది.మరోవైపు కాంగ్రెస్లో బలమైన నేత అయిన జానారెడ్డిని వదులుకునేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. జానారెడ్డి కుటుంబం కాంగ్రెస్లోనే ఉండాలని ఆ పార్టీ అనుకుంటోంది. ఇక జానారెడ్డికి సీఎం కేసీఆర్తోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో రఘువీర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నాయి రాజకీయ వర్గాలు. మొత్తానికి నాగార్జున సాగర్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది.