హైదరాబాద్, డిసెంబర్ 3
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్కు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. గ్రేటర్ వ్యాప్తంగా 30 సర్కిళ్లలో కౌంటింగ్ సెంటర్లను రెడీ చేసింది. 150 వార్డుల ఓట్ల లెక్కింపు శుక్రవారం పొద్దున 8 గంటలకు మొదలుకానుంది. 30 కేంద్రాలతో కలుపుకునని 166 కౌంటింగ్ హాల్స్ను ఎస్ఈసీ ఏర్పాటు చేసింది.గ్రేటర్లోని 150 వార్డుల్లో 1,122 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో 74,67,256 ఓట్లు ఉండగా 34,50,331 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 18,60,400 మంది పురుషులు తమ ఓటు వేయగా, 15,90,219 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇతరులు 72 మంది జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు వేశారు. స్ట్రాంగ్ రూమ్లు, లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారు. 2,629 పోస్టల్ బ్యాలెట్లు జారీ చేయగా, అందులో ఎన్ని కేంద్రాల వద్దకు చేరుతాయన్నది నేడు తేలనుంది. 8 గంటలలోపు వచ్చే పోస్టల్ బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకుంటారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు 10 నుంచి 15 నిమిషాల్లో పూర్తవుతుంది.ప్రతి సర్కిల్ పరిధిలో ఉన్న వార్డులను బట్టి 150 హాల్స్ ఏర్పాటు చేస్తోంది. ఒక్కో హాల్లో 14 కౌంటింగ్ టేబుల్స్ సిద్ధం చేసింది. ప్రతి కౌంటింగ్ హాల్లో ఓ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు కౌంటింగ్ ప్రాసెస్ను పర్యవేక్షించనున్నారు. లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ప్రతి కౌంటింగ్ సెంటర్లో ఓ అబ్జర్వర్ను నియమించారు. ఒక్కో రౌండ్కి 14,000 ఓట్లను లెక్కిస్తారు. మూడు రౌండ్లలోనే పూర్తి ఫలితం వెలువడనుంది. ముందుగా పోలింగ్ కేంద్రాల వారీగా పోలైన ఓట్లను బాక్సుల్లో నుంచి తీసి 25 బ్యాలెట్ల చొప్పున బండిల్గా కడతారు. ఒక కేంద్రంలో 610 ఓట్లు పోలయ్యాయనుకుంటే, 25 చొప్పున 24 బండిల్స్ అంటే 600 ఓట్లను కట్టిన అనంతరం 10 ఓట్లు మిగులుతాయి. వాటిని పక్కన పెడుతారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 25 చొప్పున బండిల్స్ కట్టిన అనంతరం.. మిగిలే ఓట్ల (25లోపు ఉంటే)ను ఓ ట్రేలో వేసి, తర్వాత వాటిని బండిల్స్గా కడతారు. వార్డు పరిధిలోని అన్ని ఓట్లను బండిళ్లుగా కట్టిన అనంతరం.. ఒక డ్రమ్ములో వేసి కలుపుతారు. ఇలా చేయడం ద్వారా బూత్ వారీగా పోలైన ఓట్లను తెలియకుండా ఇలా చేస్తామని అదికారులు చెబుతున్నారు. ఒక్కో టేబుల్కు 1,000 ఓట్లు (40 బండిల్స్) లెక్కిస్తారు. అంటే ఒక్కో రౌండ్లో 14 వేల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గుర్తు ఆధారంగా ఓట్లను ఒక్కో డబ్బాలో వేస్తారు. అనంతరం వాటిని లెక్కించి ఏ అభ్యర్థికి ఎన్ని వచ్చాయన్నది తేలుస్తారు. రౌండ్ల వారీగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం విజేతను ప్రకటిస్తారు. కాగా, కౌంటింగ్ కేంద్రంలో ఉండే ఏజెంట్లు అభ్యంతరం చెబితే మరోసారి ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలైన ఓట్లను పరిశీలిస్తే మొదటి ఫలితం మెహిదీపట్నం డివిజన్ లో వచ్చే అవకాశం ఉంది. మొదటి రౌండ్ వివరాల వెల్లడి 11 గంటల తర్వాతే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మెహదీపట్నం డివిజన్లో 11,818 వేల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మెజార్టీ వార్డుల్లో 15 నుంచి 27 వేల వరకు ఓట్లు పోలయ్యాయి. ఈ నేపథ్యంలో 136 డివిజన్లకు సంబంధించిన ఫలితాలు రెండవ రౌండ్లలో వెలువడే అవకాశముంది. ఇక, అత్యధికంగా 37,445 ఓట్లు పోలైన మైలార్దేవ్పల్లి ఫలితం ఆలస్యంగా వెలువడే అవకాశముంది. దీంతోపాటు సుభాషనగర్ (33,191), గాజుల రామారం (30,485), అల్లాపూర్ (30,485), బన్సీలాల్పేట (29,670), తార్నాక (29,490), సీతాఫల్మండి (29,443) వార్డుల్లో మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు జరుగనుంది.
3వ రౌండ్ వరకు కొనసాగే డివిజన్ల ను పరిశీలిస్తే మొత్తం 13 డివిజన్లు ఉన్నాయి. అవీ…1. ఉప్పల్2.కంచన్బాగ్3. మైలార్ దేవరపల్లి4. అంబర్పేట5. రెహమత్నగర్6. కొండాపూర్7.అల్లాపూర్8. ఓల్డ్ బోయిన్పల్లి9. సుభాష్నగర్
10. గాజుల రామారం11. తార్నాక12.సీతాఫల్ మండి13. బన్సీలాల్పేట్
ఇదిలావుంటే, పోటీలోని క్యాండిండేట్లు ఒక్కో కౌంటింగ్ టేబుల్ దగ్గర ఒక్కో ఏజెంట్ను నియమించుకోవచ్చు. క్యాండిడేట్ లేదా క్యాండిడేట్ తరఫు ఎలక్షన్ ఏజెంట్, అడిషనల్ కౌంటింగ్ ఏజెంట్నే కౌంటింగ్ టేబుల్ దగ్గరకు అనుమతిస్తారు. హాల్లో లెక్కింపు ప్రక్రియ అంతా సీసీటీవీ కెమెరా, వీడియోగ్రఫీ ద్వారా రికార్డు చేయనున్నారు. ఓట్ల కౌంటింగ్కు వచ్చే ఏజెంట్లకు రిలీఫ్ ఏజెంట్ను ఇవ్వబోమని, కౌంటింగ్ హాళ్లలోకి సెల్ఫోన్లకు అనుమతి లేదని ఎస్ఈసీ స్పష్టం చేసింది. తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారని ఎన్నికల అధికారులు తెలిపారు. అనుమానిత ఓట్లపై రిటర్నింగ్ ఆఫీసర్దే తుది నిర్ణయమని వెల్లడించారు.ఎన్నికల కౌంటింగ్ ప్రాసెస్ను పర్యవేక్షించేందుకు సర్కిళ్ల వారీగా అబ్జర్వర్లను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్హోదాలో పనిచేస్తున్న 31 మందిని అపాయింట్ చేసింది. కౌటింగ్లో పాల్గొనే సిబ్బందితో పాటు కౌటింగ్ ఏజెంట్లు ఖచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ దగ్గర శానిటైజర్ అందుబాటులో ఉంటుందని అధికారలు తెలిపారు. అధికారులతో పాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి హాలులోకి రావలసి ఉంటుంది.