బుధవారం జరిగిన నేరేడ్ మెట్ డివిజన్ రీ కౌంటింగ్ లో టిఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి 782 ఓట్లతో విజయం సాధించారు. స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర గుర్తులు ఉన్న 544 ఓట్లను లెక్కించాలని హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు ఆ వోట్లను లెక్కించారు. కౌంటింగ్ రూమ్ దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎన్నికల అధికారుల తీరుపై బీజేపీ అభ్యర్థి ప్రసన్న నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తనకు న్యాయం జరగలేదని ప్రసన్న నిరసనకు దిగారు. ఆమెను మహిళా పోలీసులు బయటకు తరలించారు.
స్వస్తిక్ కాకుండా ఇతర గుర్తులు ఉన్నా, వాటిని లెక్కించేందుకు అనుమతిస్తూ ఈ నెల 3న ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీతో పాటు మరొకరు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి విచారించారు.
ఎన్నికల సిబ్బంది పొరపాటు కారణంగా ఓటర్ల మనోగతం వృథా కాకూడదనే ఉద్దేశంతోనే... ఇతర గుర్తులు ఉన్న ఓట్లను కూడా లెక్కించేందుకు అనుమతి ఇచ్చామని, ఇందులో ఎటువంటి దురుద్దేశం లేదని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు.