కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ 74వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. 'శ్రీమతి సోనియాగాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. భగవంతుడు ఆమెకు ఆరోగ్యంతో కూడిన దీర్ఘాయువును ప్రసాదించాలి' అని ట్వీట్ చేశారు.కాగా, సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. దేశంలో కరోనా పరిస్థితులతో పాటు, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా పార్టీ శ్రేణులు కేక్ కట్ చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సూచించారు.