భారత ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. పీఎం వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్(పి.ఎం.వాణి) పేరుతో అతిపెద్ద ప్రాజెక్ట్ చేపట్టబోతోంది. అందుకు కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. పబ్లిక్ వైఫై సర్వీస్ అందించడమే పి.ఎం.వాణి లక్ష్యం. భారతదేశంలోనే అతిపెద్ద వైఫై నెట్వర్క్ ఏర్పాటు చేనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా దేశమంతా పబ్లిక్ డేటా సెంటర్స్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. వీటికి ఎలాంటి లైసెన్స్, ఫీజు, రిజిస్ట్రేషన్ ఉండవని తెలిపారు. దేశంలో వైఫై నెట్వర్క్ వృద్ధిని ప్రోత్సహించేందుకే ఈ ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. వ్యాపారులు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సేవల్ని పొంది తమ ప్రాంతంలో వైఫై అందించొచ్చట. పబ్లిక్ వైఫై ద్వారా ఉపాధి పెరగడంతో పాటు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఆదాయం పెంచుతుందని ఆయన అన్నారు. దేశ జీడీపీని వృద్ధి చేయడానికి ఇది దోహదపడుతుందని ఆయన అన్నారు. పీఎం వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ లో వేర్వేరు ప్లేయర్స్ ఉంటారు. పబ్లిక్ డేటా ఆఫీస్, పబ్లిక్ డేటా అగ్రిగేటర్, యాప్ ప్రొవైడర్, సెంట్రల్ రిజిస్ట్రీ లాంటివి ఉంటాయి. పబ్లిక్ డేటా ఆఫీస్ వైఫై యాక్సెస్ పాయింట్స్ని ఏర్పాటు చేయడంతో పాటు వాటిని మెయింటైన్ చేస్తాయి. సబ్స్క్రైబర్లకు బ్రాడ్బ్యాండ్ సేవల్ని అందిస్తాయి. ఇక పబ్లిక్ డేటా అగ్రిగేటర్ ఆథరైజేషన్, అకౌంటింగ్ వ్యవహారాలను చూస్తాయి. పి.ఎం.వాణి ప్రాజెక్టు ద్వారా ఏర్పాటైన వైఫై హాట్స్పాట్స్ కోసం యాప్ను రూపొందించే బాధ్యత యాప్ ప్రొవైడర్లది. ఇక సెంట్రల్ రిజిస్ట్రీలో యాప్ ప్రొవైడర్స్, పబ్లిక్ డేటా ఆఫీస్, పబ్లిక్ డేటా అగ్రిగేటర్ వివరాలు ఉంటాయి. సెంట్రల్ రిజిస్ట్రీని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలీమెటిక్స్ నిర్వహిస్తుంది. వీటన్నిటి కోసం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కోటి డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది.