పాత పార్లమెంటు భవనాన్ని బ్రిటీష్ హయాంలో నిర్మించారు. అయితే అత్యాధునిక టెక్నాలజీకి అనుగుణంగా కొత్త పార్లమెంటు ఉండాలని ఎక్కువ మంది పార్లమెంటు సభ్యులు అభిప్రాయపడ్డారు. మారిన ప్రపంచానికి తగ్గట్టుగా కొత్త భవనం ఉండాలని చెప్పారు.స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత ప్రాధాన్యమైన రోజుగా డిసెంబరు 10 చరిత్ర పుటల్లోకి ఎక్కింది. కొత్త పార్లమెంటు భవనానికి ప్రధాని మోదీ భూమి పూజను నిర్వహించారు. ప్రస్తుత పార్లమెంటు భవనం పక్కనే దీన్ని నిర్మిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12.55 నిమిషాలకు శంకుస్థాపన కార్యక్రమం మొదలయ్యింది. మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా మధ్యాహ్నం 1.00 గంటకు పునాది రాయి వేశారు. నవధాన్యాలు, నవరత్నాలను వేసి, వాస్తు పురుషుడికి పూజచేశారు. కొత్త పార్లమెంటుకు 'సెంట్రల్ విస్టా' అని నామకరణం చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, విదేశాల రాయబారులు పాల్గొన్నారు. అలాగే, వివిధ రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు, ముఖ్యమంత్రులు విర్చువల్గా హాజరయ్యారు. శంకుస్థాపన ముగిసిన తర్వాత సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు.మొత్తం రూ. 971 కోట్ల అంచనాలతో నిర్మిస్తున్న ఈ భవనం 64,500 చదరపు మీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. ఆగస్టు 15, 2022లో దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించుకునే సమయానికి కొత్త పార్లమెంటు అందుబాటులోకి రానుంది. ఆ వేడుకలు సెంట్రల్ విస్టాలోనే జరుగుతాయి.కొత్త పార్లమెంటులోని లోక్ సభలో 888 మంది సభ్యులు కూర్చునేలా నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో మొత్తం 1,224 సభ్యులు కూర్చునేలా ఈ నిర్మాణం జరగనుంది. రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునేలా, భవిష్యత్తులో సభ్యుల సంఖ్య పెరిగినా వారికి కూడా సరిపోయేలా హాల్ ను నిర్మించనున్నారు. ప్రస్తుతం లోక్ సభలో 543 మంది, రాజ్యసభలో 245 మంది సభ్యులు ఉన్నారు.ప్రతి పార్లమెంటు సభ్యుడికి 40 చదరపు మీటర్ల ఆఫీస్ స్పేస్ ను శ్రమ శక్తి భవన్ లో ఏర్పాటు చేయనున్నారు. ఈ భవనం 2024 నాటికి పూర్తవుతుంది. కొత్త పార్లమెంటు భవనం మన చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది. ప్రతి అడుగులో భారతీయత ఉట్టిపడేలా నిర్మాణం జరగనుంది.
మరోవైపు పాత భవనం కొంత ఇరుకుగా కూడా ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని అప్ గ్రేడ్ చేసే అవకాశం కూడా లేకపోవడంతో, కొత్త భవనాన్ని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. 93 సంవత్సరాల ప్రస్తుత పార్లమెంటు భవనానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా, భూకంపాలను కూడా తట్టుకునేలా కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుత పార్లమెంటు భవనాన్ని పురావస్తుశాఖకు అప్పగిస్తున్నట్టు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు