తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హస్తిన ఢిల్లీ వెళ్లనున్నారు... ఏకంగా మూడు రోజుల పాటు దేశ రాజధానిలోనే మకాం వేయనున్నారు గులాబీ పార్టీ చీఫ్.. తన పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ.. మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉందని చెబుతున్నారు.. ఇప్పటికే తెలంగాణ సీఎంవో.. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కోరారు. మరో వైపు.. రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా పరిస్థితి మారిపోగా.. టీఆర్ఎస్ నేతలు.. ప్రధానిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు.. ఈ తరుణంలో కేసీఆర్.. ప్రధాని అపాయింట్మెంట్ కోరడం ఆసక్తిగా మారింది. ఇక, ప్రదానితో పాటు.. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్, మరికొందరు కేంద్ర మంత్రులను సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉంది.. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల విషయాన్ని ప్రస్తావించనున్నారు. మరోవైపు.. దేశరాజధానిలోనూ పార్టీ కార్యాలయ నిర్మాణానికి పూనుకుంది టీఆర్ఎస్.. ఈ పర్యటనలో ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.