ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. మూడు రోజులపాటు ఢిల్లీలో ఉండనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు. దీర్ఘకాలికంగా పెండిగ్లో ఉన్న పలు సమస్యలపై చర్చించేందుకు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం కేంద్ర జలవనరులశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను, శనివారం పౌర విమానయాన, హౌసింగ్ శాఖల మంత్రి హర్దీప్ సింగ్ పురిని కలువనున్నట్టు సమాచారం. ఈ ఇద్దరు మంత్రులతో భేటీకి సంబంధించిన షెడ్యూల్ ఖరారైనట్టు తెలిసింది.అదేవిధంగా కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆదివారం ఆయన తిరిగి హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని ఇటీవలి కాలంలో కేసీఆర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర మంత్రులను వెళ్లి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.