మెదక్
సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రజలు గుక్కెడు నీటి కోసం కాళ్లు అరిగేలా కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 210 గిరిజన తండాలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే నియోజకవర్గంలోని మనూరు మండంలోనే మంజీర నది ప్రవహిస్తున్నా గొంతు తడుపుకోవడానికి కూడా నీరు చిక్కని దుస్థితి ఏర్పడింది.నియోజకవర్గంలో భూగర్భ జలాలన్ని అడుగంటిపోయాయి. దీంతో కుటుంబ సభ్యులంతా నీటి కోసం కిలోమీటర్లు నడుస్తూ నానా అవస్థలు పడుతున్నారు. ప్రమాదకరమైన బావుల్లోకి దిగుతూ ప్రాణాలతో కుస్తీపడుతున్నారు. ఇలా నీరు తోడుతూ కాలు జారి బావుల్లో పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తండాల్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బురద నీటినే తాగుతూ అనారోగ్యంపాలవుతున్నారు.తాగడానికే నీరు దొరక్క తాము అవస్తలు పడుతుంటే ప్రభుత్వాలు మాత్రం మరుగుదొడ్లు కట్టుకోవాలని సూచిస్తున్నాయని.. తాగేందుకే నీరు లేనప్పుడు మరుగుదొడ్లకు నీరు ఎక్కడ నుంచి వస్తుందని స్థానికులు ఆవేదనను వెల్లిబుచ్చుతున్నారు. తాము ఇన్ని కష్టాలు పడుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని.. కేవలం ఓట్ల కోసమే తమ దగ్గరకు వస్తారని వాపోతున్నారు. తమ సమస్యలను పరిష్కరించడంలో మాత్రం చొరవ చూపరంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీటి సమస్యను తీర్చి తమను ఆదుకోవాలని ప్రజలు విజ్ఞప్తిచేస్తున్నారు.