కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు 19 వ రోజుకు చేరుకున్నాయి. రోజురోజుకు రైతుల ఆందోళనలు ఊపందుకోవడంతో సింఘూ సరిహద్దుతో పాటు వివిధ ప్రదేశాలు రైతులతో నిండిపోయాయి. సోమవారం రైతు కోసంఒక రోజు ఉపవాస దీక్ష కొనసాగిస్తున్నారు. ఇలాఉండగా, కేంద్ర క్యాబినెట్ సీనియర్ మంత్రులు కూడా సమావేశమై రైతుల ఆందోళనపై చర్చించారు. ఇదే సమయంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను ఎట్టిపరిస్థితుల్లో వెనక్కితీసుకునేది లేదన్నారు. ఈ మూడు చట్టాలు రైతుల మంచి కోసమేనని, వాటిని ప్రభుత్వం తిరిగి తీసుకోదని ఫిక్కీ కార్యక్రమంలో మాట్లాడుతూ స్పష్టం చేశారు. రైతుల మాట వినడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నదని, అయితే రైతుల పేరిట రాజకీయాలు ఉండకూడదని ఆయనన్నారు.మరోవైపు, ఉపవాస దీక్షపై రాజకీయాలు మొదలయ్యాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ లక్ష్యంగా చేసుకున్నారు. వాస్తవానికి, అరవింద్ కేజ్రీవాల్ కూడా రైతులకు మద్దతుగా ఒక రోజు ఉపవాస దీక్షలో ఉంటానని చెప్పారు. దీనిపై కేజ్రీవాల్ సిగ్గుపడాలని అమరీందర్ అన్నారు. రైతుల సమస్యలపై రాజకీయాలు చేస్తున్నారని, ఈ వ్యవసాయ చట్టాలకు కేజ్రీవాల్ ప్రభుత్వం ఇంతకు ముందు ఎలా మద్దతిచ్చిందో అమరీందర్ సింగ్ గుర్తుచేశారు. తన కుమారుడిని ఈడీ బారి నుంచి కాపాడాల్సి వచ్చినందున కెప్టెన్ అమరీందర్ సింగ్ రైతు ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వానికి తాకట్టుపెట్టారని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు