పలు రాష్ట్రాలకు చెందిన పది రైతు సంఘాలు వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలిపాయి. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ను కలిసి తమ మద్దతును తెలియజేశాయి. ఆల్ ఇండియా కిసాన్ కోఆర్డినేషన్ కమిటీతో అనుబంధంగా ఉన్న ఉత్తర ప్రదేశ్, కేరళ, తమిళనాడు, తెలంగాణ, బీహార్, హర్యానా వంటి రాష్ట్రాలకు చెందిన పది రైతు సంఘాల నేతలు వ్యవసాయ చట్టాలను సమర్థించారు. రైతు నేతల బృందం కేంద్ర మంత్రి తోమర్ను సోమవారం కలిసింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. మరోవైపు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని మెజార్టీ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సోమవారం దేశవ్యాప్తంగా ఒక రోజు నిరాహార దీక్షను అన్నదాతలు చేపట్టారు. వారికి సంఘీభావంగా పలు రాజకీయ పార్టీల నేతలు కూడా ఒక రోజు నిరాహార దీక్షలు నిర్వహించారు.