ఖమ్మం, డిసెంబర్ 15,
తెలంగాణలో బీజేపీ వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. రాష్ట్ర పార్టీ బాధ్యతలు భుజానికెత్తుకున్న బండి సంజయ్ తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తూ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని జిల్లాల్లో ఆయా పార్టీల్లో అసంతృప్తుల లిస్టును తయారు చేస్తున్న బీజేపీ పెద్దలు.. ఒక్కొక్కరిగా కాషాయం కండువా కప్పేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం జిల్లాలపై బీజేపీ గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఆ జిల్లాల్లోని ప్రజాదరణ కలిగిన నేతలను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు తెరవెనుక బీజేపీ పెద్దలు సదరు నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో సత్తాను చాటిన బీజేపీ అదే ఊపుతో రాబోయే అన్ని ఎన్నికల్లోనూ అధికార టీఆర్ ఎస్ను మట్టి కరిపించేందుకు సిద్ధమవుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అనంతరం వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు లేకపోలేదు. దీంతో ఈ రెండు జిల్లాలపై బీజేపీ శ్రేణులు ఆపరేషన్ ఆకర్ష్ తెరలేపినట్లు సమాచారం. ముఖ్యంగా వరంగల్లో పార్టీ బలాన్ని పెంచుకొనేందుకు రాష్ట్ర పార్టీ పెద్దలు దృష్టిసారించినట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికల నాటికి కీలక నేతలను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలో వరంగల్లో ప్రజాదరణ కలిగిన కొండా దంపతులను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు చర్చలు నడుస్తున్నట్లు సమాచారం. కొండా దంపతులు బీజేపీలోకి వస్తే రాబోయే వరంగల్ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ బలం పెరగడంతో పాటు, 2023 నాటికి వరంగల్లో అత్యధిక అసెంబ్లీ, ఎంపీ స్థానాలను గెలుచుకొనే అవకాశం ఉంటుందని బీజేపీ పెద్దల ఆలోచన. కొండా దంపతులుసైతం బీజేపీలోకి వచ్చేందుకు సముఖత వ్యక్తం చేసినట్లు జిల్లాలో ప్రచారం సాగుతుంది.ప్రస్తుతం కొండా దంపతులు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల ముందు టీఆర్ఎస్తో విబేధించి కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. అయితే వీరు బీజేపీలో చేరేందుకు కొన్ని షరతులు పెట్టినట్టు ఓరుగల్లులో ప్రచారం సాగుతుంది. తమ కుమార్తె సుస్మితా పటేల్కు భూపాలపల్లి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని బీజేపీ పెద్దల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.అయితే భూపాలపల్లిలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జంగారెడ్డి కోడలు చందుపట్ల కీర్తిరెడ్డి ఉన్నారు. అక్కడ జంగారెడ్డిని కాదని కొండా దంపతుల కుమార్తెకు బీజేపీ టికెట్ ఇస్తుందా అనేది ప్రశ్నార్థకమే. మొత్తానికి వరంగల్పై గురిపెట్టిన బీజేపీ నేతలు .. ఇతర పార్టీల్లోని కీలక నేతలకు కాషాయం కండువా కప్పేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రచారం సాగుతుంది