ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బరిలో దిగనుంది. ఈ విషయాన్ని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ స్వయంగా వెల్లడించారు. యూపీ అసెంబ్లీకి 2022లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు అన్ని పార్టీలతోపాటే ఆప్ కూడా సమయాత్తమవుతున్నది. అయితే, 2012 నవంబర్ 26న పురుడు పోసుకున్నది మొదలు ఆప్ ఇంతవరకు ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో తప్ప ఎక్కడా పెద్దగా ప్రభావం చూపలేక పోతున్నది. ఢిల్లీలో మాత్రం ఆప్ హవా కొనసాగుతున్నది. 2013, 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తాచాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2013లో మిత్రపక్షం కాంగ్రెస్ సహకరించక 48 రోజులకే ప్రభుత్వం రద్దయినా, 2015లో 70 స్థానాలకు 67 స్థానాలు కైవసం చేసుకుని ఐదేండ్ల పూర్తికాలం పరిపాలన చేసింది. 2020లో 62 స్థానాలు గెలుచుకుని మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇక పంజాబ్లో 2014 లోక్సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచిన ఆప్, 2019 ఎన్నికల్లో మూడు సీట్లు కోల్పోయి ప్రస్తుతం ఒక స్థానానికి పరిమితమైంది.
అయితే, 2017లో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో లోక్ ఇన్సాఫ్ పార్టీతో కలిసి బరిలో దిగిన ఆప్ చెప్పుకోదగ్గ ఫలితాలను సాధించింది. మొత్తం 20 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. ఇక గోవా, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయా, నాగాలాండ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ తన అభ్యర్థులను బరిలో దించినా ఒక్క స్థానంలో విజయం సాధించలేకపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు యూపీలో బరిలో దిగేందుకు ఆప్ సిద్ధమైంది.