ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో జర్నలిస్టులను అరెస్టు చేశారు. కరోనా మహమ్మారి కవరేజీకి వెళ్లినవారిని, లేదా సంక్షోభాన్ని రిపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులను అరెస్టు చేసినట్లు కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్(సీపీజే) తన నివేదికలో వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్ ఒకటో తేదీ వరకు సుమారు 274 మంది జర్నలిస్టులను అరెస్టు చేసినట్లు ఆ నివేదిక పేర్కొన్నది. జర్నలిస్టుల అరెస్టు గురించి న్యూయార్క్కు చెందిన ఓ గ్రూపు 1990 నుంచి డేటాను సేకరిస్తున్నది. గత ఏడాది 250 మంది వరకు జర్నలిస్టులను అరెస్టు చేశారని, ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగినట్లు సీపీజే చెప్పింది. నిరసనలు, రాజకీయ ఉద్రిక్తతలే ప్రధాన కారణమని తెలుస్తోంది. చైనా, టర్కీ, ఈజిప్ట్, సౌదీ అరేబియాలో ఈ అరెస్టులు ఎక్కువగా ఉన్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. మహమ్మారి వేళ రికార్డు స్థాయిలో జర్నలిస్టులను అరెస్టు చేయడం దారుణమని సీపీజే ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ జోయల్ సైమన్ ఓ ప్రకటనలో తెలిపారు. నకిలీ వార్తలను ప్రచురించిన 34 మంది జర్నలిస్టులను ఈ ఏడాది అరెస్టు చేశారు.