టీఆర్పీ రేటింగ్స్ను తారుమారు చేసిన కేసులో గత ఆదివారం అరెస్టయిన రిపబ్లిక్ టీవీ సీఈఓ వికాస్ వికాస్ ఖంచందానిని మంగళవారం పోలీసులు కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈనేపథ్యంలో వికాస్ తరఫు న్యాయవాది నితిన్ ప్రధాన్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్ఆర్ఐ, ఛార్జిషీటులో వికాస్ పేరులేకుండా ఆయనను అరెస్టు చేయడం అధికార, చట్టాల దుర్వినియోగంగా భావించాల్సి ఉంటుందని ప్రధాన్ పేర్కొన్నారు. బెయిల్ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది. వికాస్ను పోలీసులు అరెస్టు సమయంలో సెషన్స్ కోర్టు ఆయన యాంటిస్పెటరి బెయిల్ పిటిషన్ను పెండింగ్లో పెట్టింది.ఈ కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు ఇప్పటికే వికాస్ ఖాన్చందానితోపాటు ఏఆర్జీ అవుట్లియర్ మీడియా డిస్ట్రిబ్యూషన్ హెడ్ ఘణశ్యామ్సింగ్తో సహా 13 మందిని అరెస్టు చేశారు. సింగ్ తమ ఛానల్ను రిగ్ చేసేందుకు డబ్బులు పంపిణీ చేసినట్లు ఆరోపణలున్నాయి. టీఆర్పీని పెంచుకునేందుకు కొన్ని ఛానళ్లకు డబ్బు చెల్లించి మరీ బారోమీటర్లు బిగిస్తున్నారంటూ వినియోగదారుల నుంచి ఫిర్యాదు అందడంతో గత అక్టోబర్లో పోలీసులు కేసు నమోదు చేశారు. బారోమీటర్లు బిగించే అవుట్సోర్సింగ్ సంస్థ హన్సా రిసెర్చ్కు చెందిన పలువురు మాజీ ఉద్యోగులను అరెస్టు చేశారు. ఫకత్ మారాఠి, సినిమా బాక్స్ ఛానళ్ల యజమానులను అంతకుముందు కస్టడీలోకి తీసుకున్నారు.