కోల్కతా డిసెంబర్ 18
పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది టీఎంసీని పలువురు ఎమ్మెల్యేలు వీడుతున్నారు. దీంతో మమతా బెనర్జీ పార్టీ ఎమ్మెల్యేలతో శుక్రవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముందే మమతకు భారీ షాక్ తగిలింది. ఇప్పటికే టీఎంసీ సీనియర్ నేత సువేందు అధికారి, మరో ముగ్గురు నాయకులు తమ ఎమ్మెల్యే, పార్టీ సభ్యత్వాలకు రాజీనామా చేయగా, తాజాగా మరో ఎమ్మెల్యే సిల్భద్ర దత్తా టీఎంసీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో సువేందు అధికారితో పాటు జితేంద్ర తివారీ, అభిజిత్ ఆచార్య, దిప్తంగ్సు చౌదరి ఉన్నారు. ఇక గోబిందపూర్ మహేశ్పూర్, బామన్గోలా, పకువాహాట్, చందాపూర్ బ్లాక్ల అధ్యక్షులు తృణమూల్ పార్టీకి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను జిల్లా ప్రెసిడెంట్ మౌసం నూర్కు పంపారు. శనివారం బెంగాల్కు వెళ్లనున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఈ నాయకులందరూ బీజేపీలో చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి.