తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్ మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నారని, వారి ఆత్మగౌరవానికి ప్రతీకగా పరిపాలన సాగుతున్నదని, శిక్షణ, ఉపాధిని కల్పిస్తూ, అభివృద్ధి, సంక్షేమంలో మహిళలకు తగిన ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాదేపల్లి పట్టణం శాంతి నగర్లో రూ.10లక్షలతో నిర్మించిన మహిళాసంఘ భవనాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా కెసిఆర్ పరిపాలన సాగుతున్నదన్నారు. మహిళా భివృద్ధికి అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తున్న ఘనత తెలంగాణదేనన్నారు. మహిళా సాధికారతను పెంచే విధంగా, లింగ వివక్ష లేని విధంగా, మహిళ సామాజిక, ఆర్థిక, రాజకీయ స్వావలంబన దిశగా పని చేస్తున్నామన్నారు. గృహ హింస, లైంగిక వేధింపులు లేని సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. సబ్బిడీపై రుణాలు, విద్య, ఉద్యోగ, ఉపాధి, శిక్షణ, ఆర్థిక సాయం, ఉప కార వేతనాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. గతంలో ఎవరూ ఆలోచించని విధంగా, ఒంటరి మహిళలకు కూడా పెన్షన్లు ఇస్తున్నఘనత సీఎందేనన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందన్నారు. షీ టీమ్స్ ఏర్పాటు చేసి, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వాళ్ళ ఆటకట్టడి చేస్తున్న విషయం గుర్తు చేశారు.
ఆరోగ్య మహిళ-ఆరోగ్య సమాజం
సిఎం కెసిఆర్ పేరుతోనే ఏర్పాటు చేసిన కెసిఆర్ కిట్ల పథకం ఆరోగ్య సమాజ నిర్మాణానికి ఉపయోగపడుతున్నదన్నారు. గర్భందాల్చిన నాటినుంచి ఆరోగ్య లక్ష్మీ పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. ఉచితంగా పరీక్షలు చేయించి, ప్రసవం, ప్రసవానంతరం బిడ్డకు 9 నెలలు దాటే వరకు ఆతర్వాత కూడా అనేక విధాలుగా ప్రభుత్వమే తల్లీ, బిడ్డల బాగోగులు చూసుకుంటున్నదన్నారు. మగ బిడ్డ పుడితే రూ.12వేలు, ఆడబిడ్డ పుడితే అదనంగా వెయ్యి రూపాయలు కలిపి రూ.13వేలు ఇస్తున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. అలాగే జడ్చర్ల నియోజకవర్గంలోనూ మహిళలకు ఇస్తున్న అవకాశాలు, లభిస్తున్న సబ్సిడీలు, అభివృద్ధి సంక్షేమాలను ఈ సందర్భంగా మంత్రి వివరించారు.
మంత్రి దంపతులకు ఘన సత్కారం
కాగా మహిళా భవన ప్రారంభోత్సవ పూజా కార్యక్రమంలో మహిళలతోపాటు మంత్రి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. మంత్రి లక్ష్మారెడ్డి దంపతులను ఈ సందర్భంగా మహిళలు ఘనంగా సత్కరించారు. నియోజకవర్గానికి మంత్రి దంపతులు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.