తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలిచిందని, స్వయంగా రైతు అయిన సిఎం కెసిఆర్ రైతుల పక్షపాతిగా ఉన్నారని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి అన్నారు. రైతుల ఆత్మహత్యలకు తావులేని, సస్యశ్యామల ఆకుపచ్చ బంగారు తెలంగాణ నిర్మాణానికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని మంత్రి తెలిపారు. బాదేపల్లి మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, రైతు బజారులో రూ.కోటి 25లక్షలతో నిర్మించిన షెడ్లను మంత్రి లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందో మనమంతా చూశామన్నారు. ఎటు చూసినా కరువు కాటకాలు, అతి వృష్టి, అనావృష్టి, రైతులు ఆత్మహత్యలు, విత్తనాలు, ఎరువులు దొరకని పరిస్థితి ఉండేవన్నారు. పాలమూరును దత్తత తీసుకుని, చివరకు వలసల జిల్లాగా మార్చిన ఘనత కూడా మన ఉమ్మడి రాష్ట్ర పరిపాలకులదన్నారు. తెలంగాణ వచ్చాక పరిస్థితి మారిందన్నారు. రైతు చల్లగ ఉంటేనే, రాష్ట్రం, దేశం, ప్రజలు చల్లగా ఉంటారని కెసిఆర్ నమ్ముతారన్నారు. అందుకే కెసిఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే కెసిఆర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారన్నారు. నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, కల్వకుర్తి లాంటి పెండింగ్ ప్రాజెక్టులేగాక, పాలమూరు-రంగారెడ్డి వంటి కొత్త ప్రాజెక్టులను ఒక్క మహబూబ్నగర్ జిల్లాకే ఇచ్చారన్నారు. ఇక మిషన్ కాకతీయ ద్వారా కాకతీయ కాలం నాటి చెరువులను కూడా మరమ్మత్తులు చేసి, నీటితో నింపుతూ తెలంగాణని సస్యశ్యామలం చేసేందుకు పథకాలు రూపొందించారన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లానీరు ఇస్తున్నారన్నారు.
రైతాంగానికి పంట పెట్టుబడులు ఇస్తున్న ప్రభుత్వాన్ని దేశంలో ఎక్కడైనా చూశారా? అన్నారు. ఎకరాకు రూ.4వేల చొప్పున, ప్రతి ఏటా రెండు పంటలకు పంట పెట్టుబడులను రైతాంగానికి ఇస్తున్న ఎకైక ప్రభుత్వం సిఎం కెసిఆర్ది అన్నారు. వచ్చే వర్షాకాల సీజన్ నుంచే ఈ పంట పెట్టుబడులు నేరుగా రైతుల ఖాతాలో జమ అయ్యే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. రైతుల భూముల సవరింపులు చేసిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. వేలాది కోట్ల రూపాయల విలువైన పంట రుణాలను మాఫీ చేసిన ఘనత కూడా సిఎం కెసిఆర్దే నన్నారు. రైతులకు ఎరువులు కోరత లేకుండా చేయడమే గాక, 24 గంటల పాటు విద్యుత్ని ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదన్నారు. గతంలో రైతాంగానికి 9 గంటల పాటు విద్యుత్ని కూడా ఇవ్వలేకపోయారని, విద్యుత్ సమస్యలతో పరిశ్రమలను మూత వేసిన పరిస్థితులను మంత్రి లక్ష్మారెడ్డి ఏకరువు పెట్టారు.
రైతులకు కూరగాయలు, ఉద్యాన వనాలు, పండ్ల తోటల పెంపకం, సాగుకు అవసరమైన అనేక పథకాలు చేపట్టి విజయవంతంగా అమలు చేస్తున్నరాష్ట్రం కూడా తెలంగాణే అన్నారు. ప్రజలు, వారికి అవసరమైన కూరగాయల, మటన్, చికెన్ మార్కెట్లు, వ్యవసాయ మార్కెట్లు, గోదాములు ఏర్పాటయ్యాయన్నారు. రైతాంగం తమ పంటలను దళారులకు అమ్ముకోకుండా ఉండడానికి, గిట్టబాటు ధరలు లభించడానికి వీలుగా రైతు సమన్వయ సమితులను పెట్టి, రైతాంగాన్ని సంఘటితం చేసిన ఘతన సిఎం కెసిఆర్కే దక్కుతుందన్నారు. ఇంతగా రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రభుత్వం కానీ, సిఎంని కానీ గతంలో ఎన్నడూ ఎవరూ చూడలేదన్నారు.
రైతు బజారులో కూరగాయలు కొనుగోలు చేసిన మంత్రి దంపతులు
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి లక్ష్మారెడ్డి-శ్వేతా లక్ష్మారెడ్డి దంపతులు బాదేపల్లి కూరగాయల మార్కెట్ లో స్వయంగా కూరగాయలు కొనుగోలు చేశారు. ఆ కూరగాయలే ఈ రాత్రికి వండాలంటూ మంత్రి లక్ష్మారెడ్డి తన సతీమణ శ్వేతా లక్ష్మారెడ్డికి సూచించి, అందరి నోటా నవ్వులు పూయించారు. దీంతో శ్వేతా లక్ష్మారెడ్డి గారు సైతం అలాగే అంటూ సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో బాదేపల్లి వ్యవసాయ కమిటీ చైర్ పర్సన్, కార్యవర్గం, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.