YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సంతకం పెట్టడానికి నో చెప్పిన మన్మోహన్

సంతకం పెట్టడానికి నో చెప్పిన మన్మోహన్

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాను అభిశంసన తీర్మానం కోసం ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్‌కు సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రధాన న్యాయమూర్తిని అభిశంసించేందుకు ఇచ్చే నోటీసుపై సంతకం చేయడానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నిరాకరించినట్టు కాంగ్రెస్ పార్టీ స్వయంగా ప్రకటించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయాన్ని ఆ పార్టీ నేతలు కొందరు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. జస్టిస్ దీపక్ మిశ్రాను అభిశంసించేందుకు నోటీసు ఇవ్వడంపై నలుగురు సీనియర్ నేతలు వ్యతిరేకించినట్లు తెల్లుస్తోంది. మరోవైపు టీఎంసీ కూడా సీజేఐ అభిశంసనపై వెనుకడుగు వేసినట్లు సమాచారం. మరోవైపు జస్టిస్ దీపక్ మిశ్రాను అభిశంసించేందుకు కాంగ్రెస్‌తో సహా ఇతర విపక్షాలు ఉప-రాష్ట్రపతి వెంకయ్యకు నోటీసు అందజేసినట్టు సీనియర్ నేత కపిల్ సిబల్ వెల్లడించారు. ఈ సందర్భంగా సిబల్ మాట్లాడుతూ... మన్మోహన్ ఈ నోటీసుపై సంతకం చేయలేదని, ఎందుకంటే గతంలో దేశ ప్రధానిగా పనిచేశారు కాబట్టే ఆయణ్ని భాగస్వాని చేయలేదని అన్నారు. కానీ మన్మోహన్ సంతకం చేయకపోవడానికి అది కారణం కాదని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ప్రధాన న్యాయమూర్తి అభిశంసనపై ఏడు పార్టీలకు చెందిన 64 మంది రాజ్యసభ సభ్యులు నోటీసుపై సంతకాలు చేశారని, వీరిలో కాంగ్రెస్, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఎస్పీ, బీఎస్పీలు ఉన్నాయని సిబల్ తెలియజేశారు. సీబీఐ జడ్జ్ బీహెచ్ లోయా మృతిపై స్వతంత్ర విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ఆయనది సహజ మరణమేనని గురువారం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన మర్నాడే ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం నోటీసు ఇవ్వడం గమనార్హం. గత జనవరి 12 న నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మీడియా సమావేశం ఏర్పాటుచేసి, ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై చేసిన ఆరోపణలు పెనుదుమారమే రేపాయి. దీంతో ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడానికి విపక్షాలు ప్రయత్నించాయి.

Related Posts