హైదరాబాద్ డిసెంబర్ 23
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 16వ వర్ధంతి సందర్భంగా సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనను కేసీఆర్ స్మరించుకున్నారు. నిరంతర సంస్కరణ శీలిగా భారత దేశ చర్రిత్రలో పీవీ చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం అన్నారు. ఆర్థిక, విద్య, భూ పరిపాలన తదితర రంగాలలో పీవీ ప్రవేశపెట్టి, అమలు చేసిన సంస్కరణల ఫలితాన్ని నేడు భారతదేశం అనుభవిస్తున్నదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అంతర్గత భద్రత వ్యవహారాల్లోనూ, విదేశాంగ వ్యవహారాల్లోనూ మాజీ ప్రధాని అవలంభించిన దృఢమైన వైఖరి, దౌత్యనీతి భారత దేశ సమగ్రతను, సార్వభౌమాత్వాన్ని పటిష్ఠపరిచిందని సీఎం కొనియాడారు. బహు భాషావేత్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, గొప్ప పరిపాలకుడిగా అనేక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన పీవీకి ఘనమైన నివాళి అర్పించేందుకే శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంతో బాధ్యతతో నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.