న్యూ ఢిల్లీ డిసెంబర్ 24
కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీని.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ ప్రియాంకా ఇవాళ ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్రపతి భవన్కు వెళ్లి రాష్ట్రపతికి రైతు సంతకాలతో ఉన్న పత్రాలను సమర్పించేందుకు ప్రియాంకా ర్యాలీ తీశారు. అయితే పలువురు కాంగ్రెస్ నేతలతో రాష్ట్రపతి భవన్ వెళ్లేందుకు ప్రయత్నించిన ప్రియాంకాను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెను మందిర్మార్గ్ పోలీసు స్టేషన్కు తీసుకువెళ్లారు. రెండు కోట్ల మంది రైతులు సంతకాలు చేసిన లేఖను రాష్ట్రపతికి సమర్పించాలని ప్రియాంకా భావించారు. రైతులను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని అన్నారు. రైతులకు మద్దతు ఇచ్చేందుకే ఈ ర్యాలీని చేపట్టినట్లు ఆమె చెప్పారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని, ఎన్నికైన ఎంపీలు ఉన్నారని, రాష్ట్రపతిని కలిసే హక్కు అందరికీ ఉందని, ఆయన్ను కలిసే అవకాశం ఇవ్వాలని ప్రియాంకా అన్నారు. లక్షలాది మంది రైతుల మనోభావాలను వినేందుకు కేంద్రం సిద్ధంగా లేదని ఆమె ఆరోపించారు. రైతులను దేశ వ్యతిరేకులని ప్రభుత్వం ఆరోపిస్తుందంటే, అప్పుడు ప్రభుత్వం నేరానికి పాల్పడుతున్నట్లే అని ప్రియాంకా ఆరోపించారు.