నూతన వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తూ, అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయన్న ప్రధాని వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేతలు మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు.
ప్రధాని మోదీవన్నీ నిరాధారమైన ఆరోపణలని, ఆయన వ్యాఖ్యలు అపహాస్యం చేసేవిధంగా ఉన్నాయని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్,
సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, సీపీఐ నేత రాజా, ఎస్పీ నేత అఖిలేశ్, గుప్కార్ అలయెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా తదితరులు ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ''మొదట నిరాధార
ఆరోపణలను మోదీ ఆపేయాలి. చట్టాలను వెనక్కి తీసుకోవాలి. ప్రతిపక్షాలు నూతన వ్యవసాయ చట్టాలపై పదే పదే అబద్ధాలు ఆడుతున్నాయన్న మోదీ విమర్శ నిరాధారం. దీనిని తీవ్రంగా
ఖండిస్తున్నాం. మా రాజకీయాల కోసం రైతుల్ని తప్పుదోవపట్టిస్తున్నామని ప్రధాని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలు అపహాస్యపు వ్యాఖ్యలు.'' అని ప్రతిపక్ష నేతలు విరుచుకుపడ్డారు. కేంద్ర
చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు తమ సంఘీభావాన్ని ప్రకటించామని వారు తెలిపారు. దాదాపు 500 రైతు యూనియన్లు సంయుక్త్ కిసాన్ మోర్చా అన్న గొడుగు కిందకి
చేరి... ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారని ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు.