కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలపై కొందరు తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తున్నారని, భూముల్ని లాక్కుకుంటున్నారని అబద్ధాలు వ్యాపిస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ కిసాన్
సమ్మాన్ నిధి రెండవ ఇన్స్టాల్మెంట్ను రిలీజ్ చేసిన మోదీ ఆ తర్వాత రైతులను ఉద్దేశించి మాట్లాడారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్తో భూములు లాక్కుంటారని తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని,
రైతులు ఎవరూ తమ భూముల్ని కోల్పోరు అని ప్రధాని తెలిపారు. రైతు సంస్కరణలకు అటల్జీ ఆద్యుడు అని, పిఎం కిసాన్ ఫండ్ నుంచి ప్రతి రైతు లబ్ధి పొందుతున్నట్లు చెప్పారు. బెంగాల్
ప్రభుత్వం రైతులను ఇబ్బందిపెడుతున్నదని, కిసాన్ సమ్మాన్ నిధి అందకుండా చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. స్వంత రాష్ట్ర రైతులను విస్మరించి, ఇతర రాష్ట్ర రైతులను మమతా బెనర్జీ
రెచ్చగొడుతున్నట్లు మోదీ తెలిపారు. రాజకీయ పార్టీల వైఖరి వల్ల పేద రైతు మరింత పేదగా మారుతున్నారన్నారు. వ్యవసాయ చట్టాలపై కొందరు రాజకీయాలు చేస్తున్నట్లు ఆరోపించారు.
రైతుల నిరసనల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నట్లు విమర్శించారు.
ఒక్క ఏడాది చూడండి
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో రైతుల ఆందోళన
కొనసాగుతూనే ఉన్నది. కేంద్రం వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకునే వరకు తమ ఉద్యమాన్ని విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. ఆందోళన విడనాడాలని కేంద్రం తరఫున రైతులకు విజ్ఞప్తి చేశారు. ఒక ఏడాదో రెండేండ్లో ప్రస్తుత వ్యవసాయ చట్టాల అమలు జరుగనివ్వండని, ఆ తర్వాత కూడా
ఈ చట్టాలు రైతులకు మేలు చేసేలా లేవని భావిస్తే తప్పకుండా సవరణలు చేసుకుందామని సూచించారు.ఒక ఏడాదో రెండేండ్లో ఈ వ్యవసాయ చట్టాలను అమలు కానివ్వండి. ఆ తర్వాత ఈ
వ్యవసాయ చట్టాలు రైతులకు అనుకూలంగా లేవని మీరు భావిస్తే తప్పకుండా సవరణలు చేసుకుందాం. ప్రధాని ఉద్దేశం తెలిసిన మనిషిగా ఈ విషయంలో నేను మీకు హామీ ఇస్తున్నా అని
రాజ్నాథ్ సింగ్ చెప్పారు.