న్యూఢిల్లీ డిసెంబర్ 31
కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారు నైట్ కర్ఫ్యూ ప్రకటించింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం 6 గంటల వరకు, అలాగే జనవరి ఒకటిన రాత్రి 11 నుంచి జనవరి 2వ తేదీ ఉదయం వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ మధ్యకాలంలో బహిరంగ సమావేశాలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కొత్తగా బ్రిటన్ వైరస్ కేసులు నమోదైన నేపథ్యంలో.. నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించాలని కేంద్రం బుధవారం రాష్ట్రాలను కోరింది. కరోనావైరస్ కొత్త ఉత్పరివర్తన పరిస్థితిని ఎదుర్కొనేందుకు నగరం సిద్ధంగా ఉందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు.యూకే నుంచి వచ్చిన వ్యక్తుల్లో నలుగురికి కొత్త వైరస్ పాజిటివ్గా తేలింది. నాలుగు ప్రైవేట్ హాస్పిటళ్లలో ఐసోలేషన్ సదుపాయాలను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా రద్దీని అరికట్టేందుకు నూతన సంవత్సర వేడుకలపై కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలను కోరింది. గత మూడున్నర నెలలుగా దేశంలో క్రియాశీల కేసుల సంఖ్యల క్రమంగా తగ్గుతోందని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు.