YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కొత్త ఏడాది మార్పులు...

కొత్త ఏడాది మార్పులు...

హైదరాబాద్, జనవరి 1, 
కొత్త ఏడాది తెలంగాణ రాష్ట్ర సమితిలో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశముంది. ప్రధానంగా కేటీఆర్ ను 2021లో ముఖ్యమంత్రిని చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ఎన్నికలకు అప్పటికి ఇంకా మూడేళ్లు గడువు ఉండనుండటంతో కేటీఆర్ కు పట్టాభిషేకం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ తాను జాతీయ రాజకీయాల్లో దృష్టి పెడతానని చెప్పిన సంగతి తెలిసిందే. కుమార్తె కవిత కూడా రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు.కేటీఆర్ ను ముఖ్యమంత్రి గా చేసి తాను ఢిల్లీకి వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ తన కుమారుడికి పార్టీ బాధ్యతలను అప్పగించారు. కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపికై చాలా కాలమయింది. పార్టీని కేటీఆర్ ఇప్పటికే గ్రిప్ లోకి తెచ్చుకున్నారు. అనధికారికంగా కేటీఆర్ ను టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రిగానే చూస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో పనుల కోసం కేటీఆర్ చుట్టూనే తిరుగుతున్నారు.కేటీఆర్ కూడా వివిధ జిల్లాలను వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి హోదాలో పర్యటిస్తూ ఇటు నేతలకు, అటు క్యాడర్ కు తానే లీడర్ నని సంకేతాలు ఇస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు తాను క్షేత్రస్థాయిలో పరిచయం చేసుకునేందుకు కూడా ఈ పర్యటనలు కేటీఆర్ కు ఉపయోగపడుతున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలోనే కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టిస్తారని గులాబీ పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించాలని భావిస్తున్నారు. ఢిల్లీలోనే ఉండి కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీలను ఏకం చేయాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేసి తాను ఢిల్లీకి వెళ్లిపోవాలని కేసీఆర్ ను నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ కూడా టీఆర్ఎస్ లోని కొందరు ముఖ్యనేతలకు ఈ రకమైన సంకేతాలు ఇచ్చారంటున్నారు. మొత్తం మీద యువనేత పట్టాభిషేకానికి ముహూర్తం ఫిక్సయిందన్నది గులాబీ పార్టీలో టాక్.

Related Posts