నీటి పంపిణీ వివాదాలకు తెర దించేలా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిని ఖరారు చేసేందుకు కేంద్రం సిద్ధమైంది. బోర్డు పరిధిపై కృష్ణా బోర్డు పంపిన ముసాయిదాపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ ఇప్పటికే ఆమోద ముద్ర వేశారు. అపెక్స్ కౌన్సిల్ చైర్మన్, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ ముసాయిదాను ఆమోదించడం ఇక లాంఛనమే. జనవరి మొదటి వారంలో కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది. కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టంలో సెక్షన్ 85(1) ప్రకారం కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. కానీ.. పరిధిని ఖరారు చేయకపోవడం, వర్కింగ్ మాన్యువల్ను నోటిఫై చేయకపోవడం వల్ల బోర్డుకు ఎలాంటి అధికారాలు లేవు. దాంతో రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు తరచూ ఉత్పన్నమవుతున్నాయి. కృష్ణా బోర్డు ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ నాగార్జునసాగర్లో నీటి నిల్వలు సరపడా ఉన్నా.. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ యథేచ్ఛగా తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తుండటమే అందుకు నిదర్శనం.