మినీ 'పుర పోరు'కు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. ఏడు పురపాలికల ఎన్నికలకు కసరత్తు మొదలుపెట్టింది.. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం... ప్రభుత్వానికి తాజాగా లేఖ రాసింది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు అచ్చంపేట, సిద్దిపేట, జడ్చర్ల, నకిరేకల్, కొత్తూరు మున్సిపాలిటీలకు త్వరలో ఒకేదఫా ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటికి వచ్చే ఏప్రిల్ లేదా మే నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట (నాగర్కర్నూల్ జిల్లా) మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు 2021 మార్చి 14తో ముగియనుండగా, సిద్దిపేట పాలకవర్గం గడువు ఏప్రిల్ 15తో తీరనుంది. గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా హోదా పెరిగిన నకిరేకల్ (నల్లగొండ జిల్లా), జడ్చర్ల (మహబూబ్నగర్ జిల్లా), కొత్తూరు (రంగారెడ్డి జిల్లా)లకు గతంలో ఎన్నికలు నిర్వహించలేదు. ఈ పంచాయతీల ఐదేళ్ల పదవీకాలం అప్పట్లో పూర్తికాకపోవడమే దీనికి కారణం.