కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత బూటా సింగ్ తుదిశ్వాస విడిచారు. శనివారం ఉదయం బూటా సింగ్ కన్నుమూశారు. పంజాబ్ లోని జలంధర్ జిల్లాలోని ముస్తఫాపూర్లో 1934 మార్చి 21న బూటా సింగ్ జన్మించారు. బాంబేలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన బుంధేల్ ఖండ్ యూనివర్సిటీ నుంచి పీహెచ్ డీ పట్టా పొందారు. జర్నలిస్టుగా కెరీర్ ఆరంభించిన బూటా సింగ్.. అకాలీదళ్ పార్టీలో చేరి రాజకీయ జీవితం ఆరంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దళిత నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులయ్యారు. ఎనిమిది పర్యాయాలు లోక్సభ ఎంపీగా ఎన్నికయ్యారు. 1978-80 మధ్య కాలంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన రాజీవ్ గాంధీ హయాంలో కేంద్ర హోం మంత్రిగా విధులు నిర్వర్తించారు.