హైదరాబాద్ జనవరి 4,
నిరుద్యోగులు, రైతులు, ప్రైవేట్ టీచర్ల బతుకుదెరువు నిలబెట్టాలనే డిమాండ్లతో నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఈ ఉదయం నిరాహారదీక్షకు ఉపక్రమించిన ప్రొఫెసర్ కోదండరాం తన దీక్షను కొనసాగిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. పెద్దయెత్తున పార్టీ శ్రేణులు కోదండరాంతోపాటు రాత్రంతా ఉంటున్నారు. దీక్షకు మద్దతు తెలిపిన సీపీఐ, తెదేపా, న్యూడెమోక్రసీ, లేబర్ పార్టీ, విద్యావంతుల వేదిక, ప్రజాసంఘాలు, ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్ అసోసియేషన్, ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ డి.ఎన్.రెడ్డి, సాహితీపరిశోధకుడు జయధీర్ తిరుమలరావు, పాలమూరు అధ్యయన వేదిక రాఘవాచారి, తదితరులు కోదండరాం దీక్షకు సంఘీభావం తెలిపారు. మరింతమంది పార్టీల నాయకులు, ప్రజాసంఘాల బాధ్యులు, మేధావులు వస్తున్నారని; డిమాండ్ల సాధనలో వెనుకకు తగ్గే ప్రసక్తి లేదని, పరిష్కారం దిశగా తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని పార్టీవర్గాలు ప్రకటించాయి.