భువనేశ్వర్ జనవరి 6
ఒడిశాలోని చిలికా సరస్సుకు ఈ ఏడాది అత్యధిక స్థాయిలో వలస పక్షులు వచ్చాయి. సుమారు 12 లక్షలకు పైగా వలస పక్షులు వచ్చినట్లు అధికారులు చెప్పారు. గత రెండు దశాబ్ధాల్లో ఈ రికార్డు నమోదు కావడం ఇదే మొదటిసారి అని అధికారులు పేర్కొన్నారు. రామ్సార్ కన్వెన్షన్, యునెస్కో వారసత్వ సంపదగా .. చిలికా సరస్సుకు గుర్తింపు ఉన్నది. ప్రతి ఏడాది నిర్వహించే వలస పక్షుల వార్షిక లెక్కల నివేదికను మంగళవారం విడుదల చేశారు. ఈ ఏడాది 12,04,351 వలస పక్షులు వచ్చినట్లు నివేదికలో వెల్లడించారు. వీటిల్లో సుమారు 111 జాతుల పక్షులు ఉన్నట్లు గుర్తించారు. 2019లో చిలికా సరస్సుకు సుమారు 10.70 లక్షల వలస పక్షులు వచ్చాయి. ఈ ఏడాది చిలికా సరస్సుకు వచ్చిన పక్షుల్లో 38,475 పక్షలు మాత్రం స్థానిక ప్రాంతాల నుంచి వచ్చినట్లు తేల్చారు. మొత్తంమీద ఈ ఏడాది చిలికా సరస్సుకు సుమారు 1.35 లక్షల వలస పక్షుల సంఖ్య పెరిగినట్లు డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ కేదార్ కుమార్ స్వెయిన్ తెలిపారు.