ఖమ్మం జనవరి 7,
భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుఘ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ శుక్రవారం ఖమ్మంలో పర్యటిస్తారని భాజపా జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్రెడ్డి తెలిపారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అగ్రనాయకులు ఖమ్మం పర్యటనకు వస్తున్నట్లు పేర్కొన్నారు. 8న ఉదయం 10 గంటలకు ఖమ్మం చేరుకుంటారని, మధ్యాహ్నం మామిళ్లగూడెంలోని వీవీసీ ఫంక్షన్హాల్లో వివిధ వర్గాల ప్రముఖులు, మేధావులతో రాజకీయ రహిత సమావేశంలో వారు పాల్గొంటారని, అనంతరం మీడియాతో చిట్ ఛాట్ నిర్వహిస్తారని తెలిపారు
సాయంత్రం 5 గంటలకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పోలింగ్ బూత్ కమిటీల ప్రతినిధులతో సంస్థాగత సమావేశం, అనంతరం ఉమ్మడి జిల్లా పార్టీ ఆఫీస్ బేరర్ల సమావేశంలో పాల్గొంటారని వివరించారు. రాత్రి 9 గంటలకు బయలుదేరి వరంగల్ వెళతారని తెలిపారు. పార్టీ అగ్రనేతల పర్యటనను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలను కోరారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సుబాబుల్ పంట సాగు చేస్తున్న రైతులకు సారపాకలోని ఐటీసీ కాగితం పరిశ్రమ తీవ్ర నష్టం కలిగిస్తోందని నాయకులు ఆరోపించారు. సమావేశంలో దుద్దుకూరి వెంకటేశ్వరరావు, రామలింగేశ్వరరావు, గెంటేల విద్యాసాగర్, సరస్వతి, వీరుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.