వరంగల్ జనవరి 7,
నియోజకవర్గంలోని 6 మండలాలు, మున్సిపాలిటీకి చెందిన 33 మంది ముస్లిం మైనారిటీ మహిళలకు రూ. 33 లక్షల 4 వేల విలువైన "షాది ముబారక్" చెక్కులను గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా పైసా లంచం ఇవ్వకుండా నిరుపేదలైన ఎంతో మంది ఈ సంక్షేమ పథకాల ద్వారా లబ్దిపొందుతున్నారన్నారు. కొన్ని సాంకేతిక లోపాల వల్ల షాది ముబారక్ చెక్కుల పంపిణీలో కాస్త జాప్యం జరిగిందన్న ఆయన మరొకసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూస్తామన్నారు. లాక్ డౌన్ వల్ల ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ పేదవారికి అందే సంక్షేమ పథకాలు మాత్రం ఎక్కడ ఆగకుండా సీఎం కేసీఆర్ పకడ్బందీగా అమలు చేస్తున్నారని కొనియాడారు. భారతదేశ సంక్షేమ యావనికపై ఈనాడు తెలంగాణ సాగునీటి, త్రాగునీటి, సంక్షేమ రంగాల్లో తనదైన ప్రత్యేకతను చాటుకుందన్నారు. కేసీఆర్ పాలన ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించిన 'పెద్ది' ప్రతి ఇంటికి ఎదో ఒక విధంగా లబ్ది చేకూరుస్తున్న సంక్షేమ పథకాలు యావత్ భారతదేశాన్ని ఆకర్షిస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డీవో, ఆరు మండలాల ఎమ్మార్వోలు, మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజని కిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి, ఎంపిపి, వైస్ ఎంపిపి, జెడ్పిటిసి, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపిటిసిలు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.