న్యూఢిల్లీ, జనవరి 8,
ప్రధాని నరేంద్రమోదీ నుంచి అనూహ్యమైన నిర్ణయాలను మాత్రమే ఎవరైనా ఆశించాల్సి ఉంటుందని దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతిగా రాజ్యాంగ బాధ్యతలు నెరవేరుస్తున్న కాలంలో తన జీవిత జ్ఞాపకాల గురించి ప్రణబ్ ముఖర్జీ తాజా పుస్తకంలో పంచుకున్నారు. ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్ 2012-2017 పేరిట ప్రణబ్ రాసిన పుస్తకం మోదీ నాయకత్వ శైలి గురించి వివరంగా పేర్కొంది. మోదీ కన్నా ముందు ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ కు మోదీకి మధ్య పోల్చి చూసింది. పార్లమెంటు వ్యవహారాలు 2014-2019 కాలంలో సరిగా నడవకపోయినందుకు అధికార పక్షం తోపాటు ప్రతిపక్షం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రణబ్ తన పుస్తకంలో పేర్కొన్నారు. అయితే పాలించే నైతికాధికారం ప్రధాని బాధ్యతగానే ఉంంటుందన్నారు.మోదీ విషయంలో ప్రణబ్ ఎవరికీ తెలియని కొత్త విషయాలు చెప్పారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటికి మోదీకి విదేశీవ్యవహారాల్లో అనుభవం లేదని, గుజరాత్ ముఖ్యమంత్రిగా కొన్ని దశాలకు మోదీ అంతకుముందు వెళ్లినప్పటికీ ప్రధానిగా రాజ్య వ్యవహారాలు నడపడానికి అవి సరిపోలేదని ప్రణబ్ చెప్పారు.2014లో దేశ నూతన ప్రధానిగా తాను పదవీ ప్రమాణం చేసే సమయంలో సార్క్ దేశాల అధినేతలను ఆహ్వానించడానికి మోదీ ప్రయత్నించారు. మోదీ నుంచి అనూహ్యమైన విషయాలనే మనం ఆశించవలసి ఉందని అప్పుడే అర్థమైందని ప్రణబ్ చెప్పారు. ఎందుకంటే మోదీకి సైద్ధాంతికపరమైన విదేశీ విధానపు బరువు లేదు. అందుకే మోదీ ఇలాంటి ఆశ్చర్యకరమైన నిర్ణయాలను కొనసాగింస్తూ వచ్చారని ప్రణబ్ వివరించారు.
2015 డిసెంబర్లో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ను ఆయన జన్మదినం సందర్భంగా అభినందించటానికి మోదీ అనూహ్యంగా లాహోర్ సందర్శించారని, ఆవిధంగా ఆయన దిగ్భ్రాంతికరమైన అంశాలను కొనసాగించారని ప్రణబ్ చెప్పారు. అలాగే చైనా అగ్రనాయకత్వంతో ప్రతి ఏడాదీ వార్షిక భేటీ జరపాలన్నది కూడా మోదీ నిర్ణయమేనని, దాంట్లో భాగంగానే 2018లో వూహాన్లో 2019లో తమిళనాడు లోని మామల్లపురంలో భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు జింగ్ పిన్ భేటీ జరిపారని ప్రణబ్ తన పుస్తకంలో తెలిపారు. అయితే లాహోర్లో ప్రధాని మోదీ విమానం దిగి షరీప్ ఇంటికి వెళ్లడం అనవసరమైనదీ, నాటి భారత్, పాక్ సంబంధాల నేపథ్యంలో మోదీ అలా చేసి ఉండాల్సింది కాదని ప్రణబ్ అభిప్రాయపడ్డారు.
అలాగే పెద్ద నోట్లరద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాత్మక చర్యలు చేపట్టిన సందర్భాల్లో కూడా మోదీ పని శైలిని పట్టిస్తాయని ప్రణబ్ చెప్పారు. ఎలాంటి చర్చా జరపకుండానే పెద్ద నోట్ల రద్దు గురించి మోదీ బహిరంగంగా ప్రకటించడం చూసి తాను ఆశ్చర్యపడలేదని ప్రణబ్ చెప్పారు. మోదీ పని శైలే అలాంటిదని చెప్పారు. 2016 నవంబర్ 8కి ముందు పెద్దనోట్ల రద్దు గురించి తనకేమాత్రం తెలీదని, ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవాల్సిఉందని కాని అలా జరగలేదని ప్రణబ్ తెలిపారు.