నగరంలో ఉన్న ఫ్లైఓవర్లను మరింత ఆకర్షనీయంగా, ఆహ్లాదకరంగా రూపొందించేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఫ్లైఓవర్లను పరిశుభ్రంగా ఉంచడం, ఆకర్షనీయంగా ఉండేందుకు రంగురంగుల పెయింటింగ్లను వేయించడం, గ్రీనరిని ఏర్పాటు చేయడం, ఆకట్టుకునేలా ఉండేలా ఎల్.ఇ.డి లైటింగ్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకై వెళ్లిన నగర మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్లు న్యూఢిల్లీలోని ఫ్లైఓవర్లు హ్యాంగింగ్ గార్డెన్లు, రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరణ, ఆకర్షనీయమైన పెయింటింగ్లతో పలువురుని ఆకట్టుకునే విదంగా ఉన్నాయని గమనించారు. న్యూఢిల్లీ మాదిరిగానే గ్రేటర్ హైదరాబాద్లోని ఫ్లైఓవర్లను కూడా అందంగా, ఆకర్షనీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్కు సూచించారు. దీంతో జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్, బయోడైవర్సిటీ, ఇంజనీరింగ్ విభాగాలు సంయుక్తంగా సమావేశమై ఫ్లైఓవర్లను మరింత ఆకర్షనీయంగా రూపొందించేందుకు ప్రణాళికలు రూపొందించారు. దీనిలో భాగంగా మొదటి దశలో మాసబ్ ట్యాంక్, బషీర్బాగ్, పంజాగుట్ట, గ్రీన్ల్యాండ్స్, తెలుగుతల్లి, హరిహరాకళాభవన్, సి.టి.ఓ, బేగంపేట్ ఫ్లైఓవర్లను మరింత అందంగా విద్యుత్ దీపాలు, గ్రీనరి, పెయింటింగ్లతో అభివృద్ది చేయాలని ప్రణాళికలు రూపొందించారు. దీంతో పాటు హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఫ్లైఓవర్లను హెచ్.ఎం.డి.ఏ ద్వారా అభివృద్ది చేయాలని నిర్ణయించారు. ఏఏ ఫ్లైఓవర్లను ఏవిధమైన డిజైన్లతో అలంకరించాలి, లైటింగ్, మొక్కల ఏర్పాటు తదితర అంశాలను ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయించారు. దీనిని అనుసరించి టెండర్లను రూపొందించిన జీహెచ్ఎంసీ అధికారులు ఫ్లైఓవర్ల సుందరీకరణ పనులను ముమ్మరంగా చేపట్టారు. ఫ్లైఓవర్లకు ప్రైమరీ స్థాయిలో రంగులు వేయడం, విద్యుత్ దీపాల ఏర్పాటు, వైరింగ్ ఏర్పాటు చేయడం, ఫ్లైఓవర్ల క్రింద గార్డెనింగ్ పనులు నిర్వహిస్తున్నారు. ఈ పనులన్నింటిని మే మాసాంతంలోగా పూర్తిచేయాలని జీహెచ్ఎంసీలో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ అధికారులను ఆదేశించారు.