ముంబాయ్ జనవరి 13
బాంబే హైకోర్టులో విరసం నేత వరవరరావు(88) బెయిల్ పిటిషన్పై బుధవారం విచారణ జరిగింది. ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని వరవరరావు భార్య పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ ఎస్ ఎస్ షిండే, మనీశ్ పిటాలేతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్ఐఏ, మహారాష్ట్ర ప్రభుత్వానికి డివిజన్ బెంచ్ సూచనలు చేసింది. వరవరరావు వయసు, ఆరోగ్యం పరిగణలోకి తీసుకోవాలని తెలిపింది. మనమంతా మనుషులమన్న విషయం మరిచిపోకూడదంది. అనారోగ్యంతో ఉన్న వరవరరావుని గత నెల క్రితం ముంబయి నానావతి ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నాడు. చికిత్స ఖర్చులు తామే భరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఎల్గార్ పరిషద్ కేసులో వరవరరావు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. బెయిల్ పిటిషన్పై విచారణను న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది.