వాహన యజమానులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వలస వెళుతున్న వాహనాల యజమానులు అక్కడ తమ వాహనానికి కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ఎలాంటి రోడ్డు ట్యాక్స్ చెల్లించనవసరం లేదని కేంద్రం ప్రకటించింది. అసోం రాష్ట్రంలోని గౌహతీ నగరంలో జరిగిన వివిధ రాష్ట్రాల రవాణ శాఖ మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దేశంలో వాహనాలపై రోడ్డు పన్ను విధించడంలో రాష్ట్రాలు ఏకీకృత పన్ను విధానాన్ని అమలు చేయాలని తాజాగా నిర్ణయించారు. వాహనం ధరను బట్టి మూడు రకాల స్లాబ్ లను కేంద్రం ప్రకటించింది. పది లక్షల రూపాయల లోపు వాహనాలపై 8 శాతం రోడ్డు ట్యాక్స్ వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించింది.
పది నుంచి 20 లక్షల రూపాయల విలువగల వాహనాలపై 10 శాతం పన్ను, 20లక్షల రూపాయలకు పైగా విలువ గల కార్లపై 12 శాతం రోడ్డు ట్యాక్స్ వసూలు చేయాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వివరించారు.