YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చిరంజీవి స్ట్రాటజీతో కేసీఆర్

చిరంజీవి స్ట్రాటజీతో కేసీఆర్

నల్గొండ, జనవరి 15, 
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక మార్చి నెలలో జరిగే అవకాశం ఉంది. ఈ ఉపఎన్నికను కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఎలాగైనా తమ మనుగడ తెలంగాణలో కొనసాగించాలని అనుకుంటూ ఉంది. సీనియర్ నేత, నియోజకవర్గంపై గట్టి పట్టున్న కుందూరు జానారెడ్డిని తమ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించింది. ఇక్కడి నుంచి ఎనిమిదోసారి గెలవడం కోసం జానారెడ్డి ప్రణాళికలను మొదలుపెట్టారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు రాకుండా పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియను వాయిదా వేసింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. జానారెడ్డి వైపే ఓటర్లు ఉన్నారని.. నియోజకవర్గంలోని కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో జరుగుతున్న భేటీల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. నియోజకవర్గ పరిధిలోని మండలాలు, గ్రామాల్లో ఆయన పర్యటిస్తున్నారు.  నాగార్జునసాగర్‌లో గెలవడం ద్వారా టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు టీఆర్ఎస్, బీజేపీలు బలమైన అభ్యర్థుల కోసం గాలిస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి బరిలో దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరో వైపు నోముల నర్సింహయ్య కుమారుడికి టికెట్ ఇవ్వాలని యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలు కోరుతున్నారు. ఇక్కడే మరో ఆసక్తికర ప్రచారం కూడా సాగుతోంది. టీఆర్ఎస్ పార్టీ నుంచి లాంబాడీ సామాజికవర్గానికి చెందిన నేతను సైతం బరిలోకి దింపే అవకాశం ఉందని అంటున్నారు. సీపీఎంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన రామచంద్రు నాయక్‌కు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.  ఇక్కడ లాంబాడీ సామాజిక వర్గ జనాభా ఎక్కువ కావడంతో 2009లో చిరంజీవి నాయక్‌కు టికెట్ ఇచ్చారు. అదే వ్యూహాన్ని టీఆర్ఎస్ అమలుచేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. జానా రెడ్డి హవాలో సాగర్‌లో గెలవలేకపోతే.. రెండోస్థానంలోనైనా నిలవాలనేది టీఆర్ఎస్ వ్యూహంగా ఉందని అంటున్నారు. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ నాగార్జునసాగర్‌లోనూ సత్తా చాటాలని అనుకుంటూ ఉంది. టికెట్ కోసం చాలా మంది ఆశగా ఎదురు చూస్తున్నప్పటికీ.. జానారెడ్డిని ఢీకొట్టే స్థాయి నేత కోసం బీజేపీ గాలిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీతో పోలిస్తే.. నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ బలం చాలా ఎక్కువగా ఉండడంతో బీజేపీకి ఇక్కడ అంత ఈజీ కాదని కూడా విశ్లేషకులు అంటూ ఉన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండు పార్టీలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకే టికెట్ కేటాయిస్తే.. బీజేపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలో దింపే అవకాశం లేకపోలేదు అని కూడా అంటున్నారు. నాగార్జున సాగర్ త్రిముఖ పోరులో గెలిచేది ఎవరో..?

Related Posts