73వ ఆర్మీ దినోత్సవం సందర్భంగా అధికారులు, సైనికులు, సిబ్బంది, వారి కుటుంబాలు, మాజీ సైనికులకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ఆర్మీ దినోత్సవం సందర్భంగా భారత సైన్యానికి చెందిన పరాక్రమ పురుషులు, మహిళలకు శుభాకాంక్షలు అంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా దేశ సేవలో చేసిన త్యాగాలను, ధైర్య సాహసాలను గుర్తుంచుకుంటామన్నారు. సైనికులు, వారి కుటుంబాలకు దేశం ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటుంది అని తెలిపారు.అలాగే ప్రధాని నరేంద్ర మోదీ సైతం ట్విట్టర్ ద్వారా ఆర్మీ డే శుభాకాంక్షలు తెలిపారు. దేశ సైన్యం బలమైందని, ధైర్యమైందన్నారు. సైన్యం ఎప్పుడూ దేశాన్ని గర్వించేలా చేస్తుందని పేర్కొన్నారు. దేశ ప్రజలందరి తరఫున తాను భారత సైన్యాన్ని వందనం చేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.ప్రతి సంవత్సరం జనవరి 15న ఆర్మీ డే నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. భారత సైన్యం మొదటి కమాండ్ ఇన్ చీఫ్, ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప.. భారతదేశపు చివరి బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుట్చేర్ తర్వాత 1949, జనవరి 15న బాధ్యతలు స్వీకరించారు. ఆ రోజు నుంచి భారతదేశం సైన్యం ప్రారంభమైనట్లుగా భావిస్తున్నారు. దేశాన్ని, పౌరులను రక్షించేందుకు ప్రాణాలను అర్పించిన సైనికులకు నివాళులర్పించేందుకు జనవరి 15న ఆర్మీ డేను నిర్వహిస్తున్నారు. ఆర్మీ డే సందర్భంగా ఢిల్లీలోని కరియప్ప పరేడ్ గ్రౌండ్లో కవాతు నిర్వహిస్తారు. ఇక్కడ దేశ రక్షణలో సేవలందించిన వారికి పలు పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఢిల్లీతో పాటు అన్ని ప్రధాన కార్యాలయాల్లో కవాతులు, ఇతర సైనిక ప్రదర్శనలు జరుగుతాయి.