తమ సహనాన్ని పరీక్షించొద్దు అని చైనాకు పరోక్ష హెచ్చరిక చేశారు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే. ఢిల్లీలో జరిగిన ఆర్మీ డే పరేడ్ సందర్భంగా ఆయన మాట్లాడారు. సరిహద్దుల్లో చైనాతో ఉన్న టెన్షన్ తెలిసిందే అని, బోర్డర్ను మార్చే కుట్ర జరుగుతోందని, దానికి గట్టిగా బదులు ఇచ్చామని, గాల్వన్ దాడిలో అమరులైన వీరుల త్యాగాలు వృధాపోనివ్వమని ఆర్మీ చీఫ్ హామీ ఇచ్చారు. గత ఏడాది జూన్ 15వ తేదీన గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్, చైనా మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. పలు దఫాలు రెండు దేశాల మధ్య సైనిక, దౌత్య చర్చలు కూడా సాగాయి. కానీ లడాఖ్ సరిహద్దుల్లో మాత్రం టెన్షన్ తగ్గలేదు. చర్చల ద్వారా, రాజకీయంగా సరిహద్దు దేశాలతో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి ఆర్మీ చీఫ్ నరవాణే తెలిపారు. కానీ ఎవరూ కూడా తమ సహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేయవద్దు అన్నారు.
కోట్లు ఖరీదైన ఆయుధాలు..
పాకిస్థాన్కు కూడా గట్టి హెచ్చరిక చేశారాయన. గత ఏడాది కాల్పుల విరమణ ఘటనలు 44 శాతం పెరిగాయని, అది పాకిస్థాన్ మోసపూరిత బుద్ధిని బయటపెడుతోందన్నారు. భారత్లోకి చొరబడేందుకు సుమారు 400 మంది ఉగ్రవాదులు పాక్ సరిహద్దులు వేచి ఉన్నట్లు ఆయన తెలిపారు. నియంత్రణ రేఖ వద్ద గత ఏడాది 200 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు నరవాణే చెప్పారు. ఆధునీకరణ కోసం ఆర్మీ అన్ని చర్యలు తీసుకుంటోందని, ఎమర్జెన్సీ-ఫాస్ట్ట్రాక్ పద్ధతిలో ఆ పనులు జరుగుతున్నట్లు ఆర్మీ చీఫ్ తెలిపారు. గత ఏడాది సుమారు 5వేల కోట్ల ఖరీదైన ఆయుధాలను ఆర్మీ ప్రొక్యూర్ చేసినట్లు ఆయన చెప్పారు. సుమారు 13 వేల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కూడా ఆయన చెప్పారు.