YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

రాజకీయం తెలంగాణ

కందుల విషయంలో అందోళన వద్దు - మంత్రి నిరంజన్ రెడ్డి

కందుల విషయంలో అందోళన వద్దు - మంత్రి నిరంజన్ రెడ్డి

పెద్దపల్లి నియోజకవర్గం గర్రెపల్లిలో రైతువేదికను  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు.  ఈ కార్యక్రమానికి  ఎంపీ నేతకాని వెంకటేష్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జడ్పీ చైర్మన్ పుట్ట మధు తదితరులు హజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ వ్యవసాయమే మన ప్రధాన వ్యాపకం.  అందుకే కేసీఆర్ వ్యవసాయరంగానికి ప్రాధాన్యం ఇచ్చి వినూత్న పథకాలు చేపట్టారు.  ఇది కేంద్రం, ఇతర రాష్ట్రాలే పలుమార్లు ఒప్పుకున్న విషయం.  ఏడాదికి రూ.55 వేల కోట్ల నుండి రూ.60 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఖర్చుచేస్తుంది.  మనకన్నా ఆరురెట్ల జనాభా ఉన్న యూపీలో వ్యవసాయరంగానికి మనం ఖర్చుచేస్తున్న దాంట్లో 10 శాతం ఖర్చుచేయడం లేదని అన్నారు.
 తెలంగాణలో దాదాపు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచితంగా 24 గంటల కరంటు ఇస్తున్నాం.  యూపీలో ఇప్పటికీ రైతులు ఆయిల్ ఇంజన్ల మీదనే అధారపడ్డారు .. సొంతంగా డీజిల్ పోసి నడుపుకుంటున్నారు.  తెలంగాణ మినహా దేశంలోని ఏ రాష్ట్రంలోనూ రైతుబంధు, రైతుభీమా, ఉచితకరంటు లాంటి పథకాలు లేవు.  కేవలం కొట్లాడి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మూలంగానే ఇది సాధ్యమయింది .  40 లక్షల పైచిలుకు ఆసరా ఫించన్లను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది.  రైతుబంధుకు రూ.7351 కోట్లు, రైతుభీమాకు రూ.1300 కోట్లు, ఉచిత కరంటుకు ఏడాదికి రూ.10 వేల కోట్లు, పంటల కొనుగోళ్లు, ప్రాజెక్టుల నిర్మాణం కోసం దాదాపు 60 వేల కోట్లు వెచ్చిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.  ఒక్క గర్రెపల్లి వాసులకే కోటీ 51 లక్షల రైతుబంధు నిధులు ఖాతాలలో జమ చేయబడ్డాయి.  రైతుభీమా, రైతుబంధు, భూరికార్డుల ప్రక్షాళన, పంటల కొనుగోళ్లు వంటి ఏ అంశమూ ఎన్నికల వాగ్దానం కాదు .. కేవలం రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే .. ఈ పథకాలన్నీ వారి మానసపుత్రికలు.  వ్యవసాయం రాష్ట్రాల సబ్జెక్టు ..  పంటల కొనుగోళ్లు ప్రభుత్వ బాధ్యత కాదని పలుమార్లు తెలంగాణ ప్రభుత్వం చెప్పిందని అన్నారు.
అయినా రైతులు ఇబ్బందిపడకూడదని కరోనా సమయంలో కేసీఆర్ రూ.30 వేల కోట్లతో పంటలను కొనుగోలు చేశారు.  కొత్త వ్యవసాయ చట్టాలతో కేంద్రం కొత్త విధానాలు తీసుకువచ్చింది.  కొత్త చట్టాలతో రైతులు నష్టపోతామని 50 రోజులుగా వణికించే చలిలో ఆందోళన చేస్తున్నారు.  కేంద్రం మాత్రం నూతన చట్టాలతో అద్భుతం జరుగుతుంది, కనీస మద్దతుధరకన్నా అధిక ధరలు వస్తాయని మోడీ చెబుతున్నారు.  కానీ కీలకమయిన కనీస మద్దతుధర అంశాన్ని చట్టంలో పొందుపరచడానికి కేంద్రం అంగీకరించడం లేదు.  కనీస మద్దతుధర ప్రస్తావనే చట్టంలో లేనప్పుడు బహిరంగ మార్కెట్ లో పంటల ధరలకు ప్రామాణికత ఏంటి ? - రాబోయే కాలంలో ఎఫ్ సీ ఐ వరిధాన్యం కొనుగోలు చేస్తుందా ? లేదా ? కొంటే ఎంత కొంటుంది ? అన్న విషయంలో స్పష్టత లేదు.  కోటీ 13 లక్షల టన్నుల వరిధాన్యం ఈసారి మార్కెట్ కు వస్తుందని అంచనా ? రైతులు ప్రభుత్వ కొనుగోలు మీద ఆశలు పెట్టుకుంటే పరిస్థితి ఏంటి అన్న ఆలోచనతోనే రైతులను ముందస్తుగా చైతన్యం చేస్తున్నాం.  కేంద్ర కొత్త చట్టాలతో రైతులకు ఎంతవరకు లాభం చేస్తాయో రెండు సీజన్లు ఆగితే తెలుస్తుంది.  ప్రధాని మోడీ స్వయంగా కొత్త చట్టాలతో రైతులకు ఇప్పటిధర కన్నా ఎక్కువ వస్తుంది .. రైతులు అసలు ఆపోహాలే పెట్టుకోవద్దు, ఆందోళన చెందవద్దని చెబుతున్నారు.  ఇచ్చిన మాటప్రకారం వానాకాలం కందులను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది .. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దు.  వెయ్యొద్దని చెప్పినా మొక్కజొన్న రెండున్నర లక్షల ఎకరాలలో సాగుచేశారు .. అయినా రైతుల కోసం వాటిని కొనుగోలు చేయడం జరిగిందని అన్నారు.

Related Posts