సీపీఎం జాతీయ సమావేశాలు * మూడవ రోజుకు చేరుకున్నాయి. శనివారం జరిగిన సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యుడు రామచంద్రన్ పిళ్ళై పార్టీ కార్యకలాపాల నివేదిక ప్రవేశ పెట్టారు. విశాఖ మహాసభ నుండి ఇప్పటి వరకు పార్టీ ఆద్వర్యంలో జరిగిన పోరాటాలు, ఉద్యమాల వివరాలు మహాసభ ముందు ఉంచారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 17 మంది ప్రతినిధులు నివేదిక పై జరుగుతున్న చర్చలో ఇప్పటి వరకు పాల్గొన్నారు. సమావేశాలను పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ మీడియాకు వివరించారు. దేశవ్యాప్త పోరాటాలు, పార్టీ పిలుపులు, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ప్రజా ఉద్యమాలను మహాసభ చర్చిస్తోంది. ఈ రోజు మధ్యాహన్నం వరకు 3 తీర్మానాలను మహాసభ ఆమోదించిందని ఆమె అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశ పెట్టాలని, ఖతువా, ఉన్నావ్ ఘటనలకు వ్యతిరేకంగా, వికలాంగుల హక్కులు, చట్టాల అమలు చేయాలనీ తీర్మానాలను మహాసభ ఆమోదించిందని ఆమె తెలిపారు. తీర్మానాలను సూర్యకాంత మిశ్రా, మహమ్మద్ యూసుఫ్ తరిగామీ, మురళీధరన్ లు ప్రవేశ పెట్టగా.. కామ్రేడ్. మధు గార్గ్, మాలిని భట్టాచార్య, ఝాన్సీ రాణి లు బలపరిచారని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్ లో పార్టీ బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్చ జరిగింది. కేంద్ర ప్రభుత్వం గోరక్షక్ పై చూపుతున్న శ్రద్ధ, అత్యాచార బాధితుల పట్ల చూపడం లేదు. నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తూందని బృందా కారత్ విమర్శించారు.