కర్ణాటకలోని శివమొగ్గలో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. అబ్బలగిరె గ్రామ సమీపంలో ఈ పేలుడు సంభవించడంతో 15 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్వారీలో ఉపయోగించే పేలుడు పదార్థాలను తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వాహనం పూర్తిగా దెబ్బతిన్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా శివమొగ్గ జిల్లాతో పాటు సమీపంలోని చిక్మంగళూరు జిల్లాలోనూ రాత్రి 10:30 గంటలకు భూప్రకంపనలు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. క్వారీ పేలుడు పదార్థాలు తరలిస్తున్న లారీలో పేలుడు సంభవించిన తర్వాతే భూప్రకంపనలు చోటు చేసుకుని ఉండొచ్చని స్థానికులు పేర్కొన్నారు. భారీ శబ్దాలు వచ్చాయని చెప్పారు. కిటికీలు కాసేపు కదిలాయని తెలిపారు. భూకంపం అనుకుని జనాలందరూ భయంతో బయటకు పరుగులు తీశారు. పలు భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. పలుచోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. శివమొగ్గ, చిక్మంగళూరు జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు రాత్రంతా రోడ్లపైనే ఉండిపోయారు.