పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి మరో ఝలక్. మమతా బెనర్జీ కేబినెట్ నుంచి మరో మంత్రి తప్పకున్నారు. మంత్రి పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, నేతలు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.తాజాగా బెంగాల్ అటవీ శాఖ మంత్రి రాజీవ్ బెనర్జీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయన శుక్రవారం తన ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. తన రాజీనామా లేఖను షేర్ చేశారు. అయితే.. మమతా బెనర్జీ తనను ఎంతగానో ప్రోత్సహించారని పేర్కొన్నారు.కొంతకాలంగా తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని, ఇది తనను ఎంతగానో బాధించిందని రాజీవ్ ఆవేదన వ్యక్తం చేశారు. 'నేను చాలా ఇబ్బందిపడ్డా. మానసికంగా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నా. ఇది నాకు చాలా బాధ కలిగించింది. నా గుండె బద్ధలైంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా' అని ఆయన వెల్లడించారు. రాజీనామా చేసిన అనంతరం మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రాజీవ్ ఈవిధంగా బదులిచ్చారు.'బెంగాల్ ప్రజలకు ఇంతకాలం సేవ చేసినందుకు గర్వంగా ఉంది. ఈ అవకాశం కల్పించినందుకు దీదీకి కృతజ్ఞతలు. బెంగాల్ ప్రజలకు సేవ చేయడానికి నేను కట్టుబడి ఉన్నా' అని రాజీవ్ బెనర్జీ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాజీనామా లేఖను గవర్నర్ జగ్దీప్ ధన్కర్కు పంపించినట్లు వెల్లడించారు.మమతా బెనర్జీ ఇటీవల నిర్వహించిన కేబినెట్ సమావేశానికి రాజీవ్ బెనర్జీ హాజరుకాలేదు. నాటి నుంచి ఆయన బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. మాజీ మంత్రి సువేందు అధికారితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, టీఎంసీ నాయకులు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 200 పైగా స్థానాలు దక్కించుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు.