YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

గుజరాత్ లో గుండె జారీ...గల్లంతవుతుందా

గుజరాత్ లో గుండె జారీ...గల్లంతవుతుందా

గాంధీనగర్, జనవరి 27, 
ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ లో కాంగ్రెస్ బలంపెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. గత ఎన్నికల్లో మంచి పెర్ ఫార్మెన్స్ చూపించిన కాంగ్రెస్ ఈసారి అధికారం చేజిక్కించుకోవాలన్న లక్ష్యంతో ఉంది. మరోవైపు ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సయితం ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పక తప్పదు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2022 లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.అయితే ఈసారి ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఆధ్వర్యంలో ఎన్నికలకు బీజేపీ వెళుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లోనే బీజేపీ చావుతప్పి కన్ను లొట్టపోయినట్లు ఫలితాలను సాధించింది. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా గత ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాలను సాధించింది. కాంగ్రెస్ ఎన్నడూ లేని విధంగా 77 స్థానాలను సాధించింది. రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించినా అధికారంలోకి రాలేదు. అయినా బీజేపీకి కాంగ్రెస్ గత ఎన్నికల్లో చుక్కలు చూపించిందనే చెప్పాలి.ఈసారి ఎన్నికలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉండనున్నాయి. ఇప్పటికే బీజేపీ మూడు దశాబ్దాలకు పైగానే అధికారంలో ఉంది. మోదీ ముఖ్యమంత్రి పదవి నుంచి బాధ్యతల నుంచి తప్పుకున్నాక అక్కడ నాయకత్వ సమస్య ప్రారంభమయింది. మోదీ ఇమేజ్ తోనే గత ఎన్నికల్లో ఆ మాత్రం ఫలితాలను సాధించిందని చెప్పాలి. ఈసారి కాంగ్రెస్ పార్టీ మరింత మెరుగైన ఫలితాలను సాధించాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో సొంత రాష్ట్రంలో ఓటమిని చూపి దేశ వ్యాప్తంగా మోదీ, షాల ఇమేజ్ ను దించాలన్నది కాంగ్రెస్ ప్లాన్ గా ఉంది.దీంతో పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత మోదీ, షా గుజరాత్ పై ప్రత్యేక దృష్టి పెడతారంటున్నారు. విజయ్ రూపానిని తప్పించి కొత్త నాయకత్వానికి బాధ్యతలను అప్పగించాలని భావిస్తున్నారు. లేకుంటే గుజరాత్ చేజారిపోతుందన్న ఆందోళన బీజేపీ అగ్రనాయకత్వంలో బయలుదేరినట్లే కన్పిస్తుంది. కరోనా కట్టడిలోనూ విజయ్ రూపానీ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడింది. దీంతో కొత్త నాయకత్వం నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద సొంత రాష్ట్రంపై మోదీ, అమిత్ షాలు ఇప్పటి నుంచే దృష్టి పెట్టినట్లు ఉంది.

Related Posts