బెల్గావ్ జనవరి 28
మహారాష్ట్ర, కర్నాటక మధ్య ఉన్న సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కర్నాటక సరిహద్దుల్లో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ప్రకటన చేయడంతో కొత్త వివాదం తలెత్తింది. ముంబైని కూడా యూటీగా ప్రకటించాలని కర్నాటక డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాది తెలిపారు. ముంబై మహానగరాన్ని తమ రాష్ట్రంలో కలపాలని, అంత వరకు ఆ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులో మరాఠీ మాట్లాడేవాళ్లు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు వివాదంపై రచించిన ఒక పుస్తకాన్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న బెల్గాం, కార్వార్, నిప్పని ప్రాంతాల్లో మరాఠీ భాషను మాట్లాడేవాళ్లు అధికంగా ఉన్నారు. ఆ ప్రాంతాలను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి’ అన్నారు. అయితే సీఎం ఉద్దవ్ చేసిన వ్యాఖ్యలను కర్నాటక డిప్యూటీ సీఎం ఖండించారు.
సుప్రీంలో వివాదం..
సుప్రీంకోర్టులో వివాదం పరిష్కారం అయ్యేంత వరకు ముంబైని యూటీగా చేయాలని ఆయన కోరారు. కర్నాటకలో ముంబై భాగమయ్యే వరకు దాన్ని యూటీగా చూడాలని, 1967 నాటి మహాజన్ కమిషన్ నివేదికను తాము ఆహ్వానించామని, కానీ మహారాష్ట్ర వ్యతిరేకించినట్లు మంత్రి సవాది తెలిపారు. కర్నాటక సరిహద్దు జిల్లా బెల్గామ్ పేరును బెల్గావిగా మార్చడాన్ని మహా సీఎం ఉద్దవ్ వ్యతిరేకించారు. ఈ అంశంలో ఆయన తమ కూటమి నేతలతో ఇటీవల చర్చలు జరిపారు. బెల్గామ్ను రెండవ రాజధానిగా చేసిన కర్నాటక తప్పుపని చేసిందని, కూటమి పార్టీలంతా ఏకం అయితే ఆ ప్రక్రియను అడ్డుకోవచ్చు అని సీఎం ఉద్దవ్ తెలిపారు. 1956 రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం తర్వాత మహారాష్ట్ర, కర్నాటక మధ్య సరిహద్దు వివాదం మొదలైంది. బెల్గామ్తో పాటు బాంబే స్టేట్లోని పది తాలుకాలను మైసూర్ స్టేట్లో కలిపింది. అయితే ఈ కేసు సుప్రీంలో చాన్నాళ్లుగా పెండింగ్లో ఉన్నది. బెల్గావీ, కర్వార్, నిప్పాని ప్రాంతాల్లో ఉన్న మెజారిటీల్లో మరాఠీ భాష మాట్లాడేవాళ్లు ఉన్నట్లు మహారాష్ట్ర వాదిస్తున్నది. అయితే బెల్గామ్ను తమ రాష్ట్రంలో ఒక భాగంగా మార్చామని, అక్కడ సువర్ణ విధాన సభను నిర్మించామని, ప్రతి ఏడాది ఓ సారి మండలి సమావేశాలు జరుగుతాయని కర్నాటక పేర్కొన్నది.