YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీపై సవతి ప్రేమ చూపించారు: విజయసాయిరెడ్డి

ఏపీపై సవతి ప్రేమ చూపించారు: విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ ఫిబ్రవరి 1  కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌ పూర్తిగా‌ నిరాశపరిచిందని, ఏపీకి సరైన కేటాయింపులు జరగలేదన్నారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని విమర్శించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై వరాలు కురిపించారని మండిపడ్డారు. ఏపీకి ఏమాత్రం నిధులు కేటాయించలేదని, రాష్ట్రానికి ఆత్మనిర్భర్ కూడా కనపడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వ శ్రద్ధ ఏమాత్రం కనిపించలేదని విమర్శించారు.  ఏపీలో మెట్రో రైలు కోసం కేంద్రాన్ని ఆరేళ్లుగా కోరుతున్నామని తమ విజ్ఞప్తుల్ని ఏమాత్రం పట్టించుకోలేదని అసంతప్తి చెందారు. కొత్త టెక్స్‌టైల్‌ పార్క్‌ కావాలని కోరామని దానికి సంబంధించి బడ్జెట్‌లో ఏమాత్రం కేటాయింపులు లేవన్నారు. (కేంద్ర బడ్జెట్‌: దిగి రానున్న వెండి, బంగారం ధరలు)
తాజా బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండి చేయి చూపించిందని విజయసాయిరెడ్డి అన్నారు. పోలవరం సవరించిన అంచనాలపై మాట్లాడలేదని, ఫ్రైవేట్ కారిడార్ వల్ల పెద్దగా ఉపయోగం లేదని పేర్కొన్నారు. ఎక్కువ కిసాన్ రైళ్లను వేయాలని తాము కోరగా దాన్ని కేంద్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. నేషనల్ వైరాలజీ సెంటర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలని, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రతి జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. (బడ్జెట్‌ 2021: మరింత మండిపోనున్న ఇంధనం)
అదే విధంగా లక్ష రూపాయల వరకు పన్ను మినహాయించాలని కోరినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. అప్పులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఖర్చు చేయాలన్నారు. ద్రవ్యోల్బణం పెరిగినా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారని, కేంద్ర ప్రభుత్వం ఒకటే ఫిషింగ్ హార్బర్ ఇవ్వడం పెద్దగా చెప్పుకోదగ్గ విషయం కాదన్నారు. రైతులకు ఇచ్చే పీఎం కిసాన్ సహాయాన్ని పదివేలకు పెంచాలని డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్‌ను కూడా ఆరోగ్యశ్రీ తరహాలో మార్చాలని అన్నారు. నిరుద్యోగం భారీగా పెరిగిపోయిందని, నిరుద్యోగ నిర్మూలన దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని 150 రోజులు పెంచాలని కోరినట్లు తెలిపారు.

Related Posts