వరంగల్, ఫిబ్రవరి 2,
తెలంగాణలో మరోసారి బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ రాజకీయాలు రాజుకున్నాయి. దుబ్బాక టైంలో కూడా ఇలాంటి రచ్చలే జరిగాయి ఆ దెబ్బకి బీజేపీ ఓ రేంజ్ కి వెళ్లింది. ఇప్పుడు మళ్లీ అదే స్టైల్ ఆఫ్ రాజకీయాలు రగులుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ తో ఎవ్వారం హీటెక్కింది.మామూలుగానే రాముడు అనే పాయింట్ పట్టుకుని.. ఎన్నో రాజకీయాలు చేస్తుంటుంది బీజేపీ. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఇక అయోధ్య విషయంలో ఇంకాస్త స్పెషల్. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. కానీ.. ఏ పాయింట్ అయితే టచ్ చేయకూడదో అదే పాయింట్ టచ్ చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ధర్మారెడ్డి. ఇక బీజేపీ ఆగుతుందా చెప్పండి. గొడవకి దిగారు. కోడిగుడ్లు టమాటాలతో ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేశారు. మరి స్టేట్ లో అధికార పార్టీ.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆగుతారా. తన అనుచరులు కూడా రెచ్చి పోయారు. బీజేపీ ఆఫీస్ పై అటాక్ చేశారు. ఇలా రెండు వర్గాల మధ్య వివాదం ఫుల్ హీట్ మీద ఉంది. అసలు ధర్మారెడ్డి ఏమన్నారు అందులో తప్పేంటి అనే విషయానికొస్తే ఏమీ లేదు. జస్ట్ క్వశ్చన్ చేశారు.. క్లారిటీ ఇస్తే సరిపోయేది. మరి ఏమన్నారంటే.. అయోధ్య రామాలయం కోసం సేకరిస్తున్న విరాళాలకి లెక్కా పత్రాలు ఉన్నాయా అన్నారు. రోజూ ఎంత మంది చందాలు వసూల్ చేస్తున్నారు. వాటిని ఏ రికార్డుల్లో రాస్తున్నారు. రోజూ సాయంత్రం కాగానే.. ఎంత మంది దగ్గర ఎంతెంత వసూళ్లు అయ్యాయి అనే రికార్డులు ఏమైనా మేన్ టేన్ చేస్తున్నారా అన్నారు. మోడీ సర్దార్ పటేల్ విగ్రహం కోసం అంత ఖర్చు పెట్టారు కదా. రామాలయం కోసం 11 వందల కోట్లు ఖర్చు పెట్టలేక పోయారా అని విమర్శించారు.తానైతే.. రాముడి వీర భక్తుడ్ని అని చెప్పుకున్న ధర్మారెడ్డి.. సొంత ఖర్చులతో రామాలయం నిర్మించినట్లు చెప్పుకున్నారు కూడా. అయినా సరే.. చందాల విషయంలో మాత్రం గట్టిగానే మాట్లాడారు. ఎంత వసూల్ చేస్తున్నారు. ఇంత డబ్బు అసవరమా. దేశం మొత్తం బీజేపీ ఇన్ని డబ్బులు వసూల్ చేస్తే.. అవన్నీ ఏం చేస్తారు. పక్కా రికార్డులు మేన్ టేన్ చేస్తున్నారా అంటూ.. ఇలాంటి లాయర్ క్వశ్చన్లు అన్నీ అడిగేశారు ధర్మారెడ్డి. అక్కడ మొదలైన రచ్చ ఇంకా తగ్గడం లేదు. ఎంత దాకా వెళ్తుందో చూడాలి. ఇప్పుడు మళ్లీ తెలంగాణలో.. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ గా నడుస్తున్న రాజకీయంలో.. మధ్యలో ఉన్నాడు అయోధ్య
కేటీఆర్ వార్నింగ్
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీ దూకుడును ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే..! ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ వేస్తూ బీజేపీ దూసుకువెళుతూ ఉంది. కానీ కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు దాడి చేసిన ఘటనను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారకరామారావు సీరియస్ గా తీసుకున్నారు. టీఆర్ఎస్ శ్రేణులను, పార్టీ కార్యకర్తలను కాపాడుకునే శక్తి, బలం, బలగం మాకు ఉన్నాయనే విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలని సూచించారు కేటీఆర్. టీఆర్ఎస్ కార్యకర్తల ఓపిక నశిస్తే, బీజేపీ నేతలు కనీసం బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు కేటీఆర్. మా ఓపికకూ ఒక హద్దు ఉంటుందని ఇప్పటికే బీజేపీని హెచ్చరించామని.. అయినా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకుపోతున్నామని కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ ఒక ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బీజేపీ మర్చిపోవద్దని అన్నారు కేటీఆర్. టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని ఖండిస్తున్నానని ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. బీజేపీ భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్ పార్టీకి ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏ మాత్రం చోటు లేదని.. తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపై భౌతిక దాడులకు పాల్పడుతున్న బీజేపీ తీరును ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సిన అవసరముందని అన్నారు కేటీఆర్. రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శల పరిధిని దాటి, బీజేపీ పదేపదే భౌతిక దాడులకు పాల్పడుతుండటం రాష్ట్ర రాజకీయాలకు ఏ మాత్రం శ్రేయస్కరం కాదని హితవు పలికారు.
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంపై బీజేపీ కార్యకర్తలు, నేతలు దాడికి దిగారు. అయోధ్య రామమందిరం అంశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ చల్లా ధర్మారెడ్డి నివాసంపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. హన్మకొండ నక్కలగుట్టలోని ధర్మారెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఈ దాడిలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నివాసంలోని అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం అయినట్టు గుర్తించారు. చల్లా ధర్మారెడ్డి నివాసంపై దాడి జరిగిందన్న సమాచారంతో టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. పరకాల పట్టణంలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి.